కాశ్మీర్లో కూలిన హెలికాప్టర్: హైదరాబాద్ మహిళా పైలట్, నవ దంపతులు మృతి(ఫొటోలు)
శ్రీనగర్/హైదరాబాద్: జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లా కాట్రా పట్టణంలో సోమవారం హెలికాప్టర్ కూలిన ఘటనలో హైదరాబాద్కు చెందిన మహిళా పైలట్ తోపాటు ఓ కొత్త జంటతో సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. త్రికూట పర్వతాల్లోని సంజీచాట్ హెలీప్యాడ్ నుంచి ఆరుగురు భక్తులతో హెలీకాప్టర్ బయలుదేరిందని.. కాట్రాలోని నూతన బస్టాండ్ ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు.

ప్రమాదానికి పక్షే కారణం
హెలికాప్టర్ తోకభాగంలోని రెక్కల్లో(టెయిల్ రోటార్) ఒక పక్షి చిక్కుకోవడంతో... టెయిల్ రోటార్ పనిచేయలేదని ప్రాథమికంగా నిర్ధారితమైందని ప్రమాద స్థలిని సందర్శించిన అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ పేర్కొన్నారు. టెయిల్ రోటార్ పనిచేయకపోవడంతో హెలికాప్టర్ను సురక్షితంగా కిందకు దించడానికి పైలట్ ప్రయత్నించారని.. జనబాహుళ్యం తక్కువగా ఉన్న నూతన బస్టాండ్ ప్రాంతాన్ని అందుకు ఎంచుకున్నారని వెల్లడించారు.
అయితే, కిందకు దిగుతుండగా హెలికాప్టర్ రెక్కలు విద్యుత్ తీగతో మెలిపడి మంటలు అంటుకున్నాయని... అనంతరం కుప్పకూలిందని వివరించారు. ప్రమాదంలో హెలికాప్టర్లోని వారంతా మృతిచెందినట్లు స్పష్టంచేశారు.

ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మహిళా పైలట్ సునీతా విజయన్, జమ్మూకు చెందిన అర్జున్ సింగ్, వందన, మహేష్, ఢిల్లీవాసులు సచిన్, అక్షిత(5), ఆర్యన్జీత్ మృతి చెందారు. ప్రయాణికులపై రూ.25 లక్షల బీమా ఉందని(ఒక్కొక్కరిపై)... వాటికి అదనంగా ఆలయ బోర్డు తరఫున రూ.3 లక్షల పరిహారం అందిస్తామని ఆలయ బోర్డు అదనపు సీఈవో అజిత్కుమార్ సాహు వెల్లడించారు.
కాగా, దుర్ఘటనపై 'ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో(ఏఏఐబీ)' దర్యాప్తు ప్రారంభించింది. ఇద్దరు సభ్యుల బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విడిగా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

మృతుల్లో కొత్త జంట
పెళ్లె వారం రోజులు కూడా గడవకముందే ప్రమాదంలో నవ దంపతులు అర్జున్సింగ్-వందన మృతిచెందడంతో తీవ్ర విషాధ ఛాయలు అమలుకున్నాయి. జమ్మూ నగర శివార్లలోని ఘోమానస గ్రామానికి చెందిన అర్జున్ భారత వాయుసేన(ఐఏఎఫ్)లో అధికారిగా పనిచేస్తున్నారు.
నవంబర్ 18న వందనతో ఆయనకు వివాహం జరిగింది. వైష్ణోదేవీ ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి సోమవారం ఉదయమే వారు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. అర్జున్ బంధువు మహేష్ కూడా ఘటనలో మృతిచెందారు. పెళ్లి వేడుక కోసం ఇంటికి వచ్చిన బంధువులంతా ఇంకా తిరిగి వెళ్లనేలేదు. ఈలోపే దంపతులు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications