Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..
ఉగాది సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సరం పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని ఆలయ అధికారులు రంగురంగుల పూల అలంకరణలతో, పండగ వాతావరణం ఉట్టిపడేలా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
స్వామి వారి కళ్యాణ మండపంలో పంచాంగ పూజ నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తలు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి సమయం పడుతుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి దర్శనానికి జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా వచ్చాయి.

ఉగాది ఉన్న నేపథ్యంలో మంగళవారం స్వామి వారి నిత్య కళ్యాణం, శాశ్వత కల్యాణ కార్యక్రమాలతో పాటు అభిషేక పూజలు రద్దు చేశారు.ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు ఉదయం తొలుత రాజరాజేశ్వరస్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి చతుష్షష్టి పూజలు, లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేక పూజలు చేశారు.
సాయంత్రం 4:30 గంటలకు ఈవో అతిథి గృహం ముందు పంచాంగ శ్రవణం జరపనున్నారు. మంగళవారం రాజరాజేశ్వర స్వామిని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరు బాగుండాలని కోరుకున్నారు. ఈ యాదగిరిగుట్టలో కూడా భక్తుల రద్దీ కనిపిస్తోంది. కోమురవెళ్లికి కూడా భారీగానే భక్తులు తరలొచ్చారు.












Click it and Unblock the Notifications