మంత్రిగా 2020లో ఢిల్లీ వదిలిపెట్టాలనుకున్నా, పార్టీలు మారొచ్చు కానీ: వెంకయ్య
హైదరాబాద్: తన ఎదుగుదులతో స్నేహితులు అండగా నిలిచారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. ఒకప్పుడు బీజేపీని శాకాహార పార్టీ అనే వారని చెప్పారు. హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విమర్శలను తట్టుకునే శక్తి నేటి పాలకులలో లోపించిందన్నారు. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గు వేస్తోందన్నారు. అన్ని పార్టీలు ఈ తీరును సమీక్షించుకోవాలన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి ప్రవేశించనని చెప్పారు.
తాను ఎప్పుడూ ఉపరాష్ట్రపతి పదవిని కోరుకోలేదని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు పదవికి రాజీనామా చేసి 2020 జనవరి 12న ఢిల్లీని వదిలి పెట్టాలని అనుకున్నానని చెప్పారు. నేటి సమాజంలో తప్పును తప్పు అని చెప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేకుండా పోతోందని వాపోయారు. సమావేశాలను బహిష్కరించడం సమంజసం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ఉందని, కానీ పార్టీ మారడానికి ముందే తమ తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పారు. చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలన్నారు.