బండి సంజయ్ వర్సెస్ ధర్మపురి అరవింద్.. ముక్కు నేలకు రాయాలన్న విజయశాంతి
బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో కవితను జైలుకు పంపించక ముద్దు పెట్టుకుంటారా అంటూ మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు ఆందోళనలు చేపట్టి దిష్టిబొమ్మల దహనాలు చేశారు. మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.

బండి సంజయ్ వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే సొంత పార్టీ నాయకుడైన ధర్మపురి అరవింద్ బండి సంజయ్ వ్యాఖ్యలపై చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇటు పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని, బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని ధర్మపురి అరవింద్ హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్ సెంటర్ కాదు అంటూ, అది అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో బిజెపిలోను ఆసక్తికర చర్చ జరుగుతుంది.

అరవింద్ వ్యాఖ్యలపై స్పందించిన విజయశాంతి
ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై స్పందించిన బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి ఇక ఈ వ్యవహారంలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు . బండి సంజయ్ వ్యాఖ్యలపై తను బిజెపి అంతర్గత సమావేశాల్లో మాత్రమే స్పందిస్తానని, తన అభిప్రాయం చెబుతానని క్లారిటీ ఇచ్చారు. ఇక ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై మాట్లాడిన విజయశాంతి బిజెపి నేతలు ఎవరైనా, కార్యకర్తలు అయినా సరే పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలపై పార్టీ సమావేశాలలో స్పందిస్తే అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగా పార్టీ పరిగణిస్తుంది.

అరవింద్ మాట్లాడిన దానిలో వాటినే హైలెట్ చేస్తున్న బీఆర్ఎస్
ఇక ఆ వ్యాఖ్యలను సమయాన్ని, సందర్భాన్ని, సమస్యల పరిస్థితిని బట్టి విశ్లేషించటం, దానిపై చర్చించడం కూడా, అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం అవుతుంది. ఇక ఎంపీ అరవింద్ మాట్లాడిన సందర్భం మొత్తం తాను చూడలేదని, కానీ అందులోని ఏదో ఒక అంశాన్ని బీఆర్ఎస్ అనుకూల వర్గం ప్రొజెక్టు చేస్తుందని మాత్రం తను చెప్పగలనని విజయశాంతి పేర్కొన్నారు.

వాళ్ళంతా ముక్కు నేలకు రాయాలి: విజయశాంతి
బండి సంజయ్ తన మాటల్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తే కెసిఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు వారు మాట్లాడిన వందల మాటలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని, ఇక వందలసార్లు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని గుర్తించాలి అంటూ విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. ఇక రాములమ్మ బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా లేదా అన్నది మాత్రం పార్టీ అంతర్గత సమావేశాలలోనే చర్చిస్తానని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications