ఇక చాలు!: కేసీఆర్పై ఊగిపోయిన విజయశాంతి, నాలాంటి నేత భవిష్యత్తులోను రారు: జానా
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త విజయశాంతి నిప్పులు చెరిగారు. ఆమె మహాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తున్న సుధీర్ రెడ్డికి మద్దతుగా వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, గడ్డిఅన్నారం తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడారు. కేసీఆర్ది దొరల పాలన అని మండిపడ్డారు. అలాంటి దొరల పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఓటర్లు అందరు చైతన్యవంతులు అయితే కేసీఆర్ను ఫాంహౌస్కు పంపించవచ్చునని ఆమె చెప్పారు. కేసీఆర్ది నియంతృత్వ పాలన అన్నారు.
డల్లాస్, న్యూయార్క్లా చేస్తానని చెప్పి
ప్రజాపాలన కావాలంటే మార్పు అవసరమని విజయశాంతి చెప్పారు. అందుకు తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి కూటమి మహాకూటమికి పట్టం గట్టాలన్నారు. వేల కోట్ల ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరాన్ని.. డల్లాస్, న్యూయార్క్, సింగపూర్ చేస్తానని కేసీఆర్ మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికి వదిలేసి అంధకారంలోకి నెట్టారన్నారు.
సెటిలర్ల కాలికి ముల్లుగుచ్చుకుంటే పంటితో తీస్తానని
సెటిలర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత ఏమయ్యారని విజయశాంతి ప్రశ్నించారు. ఎల్బీ నగర్ నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే సుధీర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ అభివృద్ధి చెందలేదని చెప్పారు.
అప్పుల ఊబిలోకి నెట్టారు
తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుతానని చెప్పి అప్పుల ఊబిలోకి నెట్టారని విజయశాంతి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై గుంతను చూపిస్తే రూ.1000 బహుమతిగా ఇస్తామని చెప్పారని, కానీ నగరంలో ఉన్న రోడ్లను చూసి సిగ్గుపడాలని అన్నారు. జీహెచ్ఎంసీ అర్థాన్నే మార్చివేశారని విమర్శించారు. నగరంలో డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. ఇక లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇప్పటి వరకు నష్టపోయింది చాలు
ఆయా ప్రభుత్వ పథకాలు పాలకుల జేబులు నింపడానికే ఉపయోగపడుతున్నాయని రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు చాలా నష్టపోయారని, ఇక చాలని, మరోసారి ఆ పొరపాటు చేయవద్దని చెప్పారు. సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగల సత్తా కలిగిన వ్యక్తి అన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి మహాకూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు.
నాలాంటి నేత ఎవరూ లేరు, రారు
తెలంగాణలో అత్యంత ప్రజాభిమానం ఉన్న నాయకుడిని తానేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతజానారెడ్డి వేరుగా అన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలిచి తాను చరిత్ర సృష్టించానన్నారు. నాగార్జునసాగర్ ప్రజలే తనను మహానేతను చేశారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జానారెడ్డి నల్గొండ జిల్లా నిడమనూర్ మండలంలో ఉన్న పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనలా ఇన్నిసార్లు ప్రజాభిమానంతో గెలుపొందే నాయకుడు రాష్ట్రంలో ఎవ్వరూ లేరని చెప్పారు. ఇకపై ఎవరూ రాని కూడా చెప్పారు. ఈసారి తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్నారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనీ, ఈ ఎన్నికల్లో తెరాసను మట్టికరిపించాలన్నారు.