రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు..బీజేపీది తెలంగాణ వ్యతిరేక ఎజెండా : వినోద్ విసుర్లు
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఓ రేంజ్లో ఫైరయ్యారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత వినోద్కుమార్. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ బెంగాల్ మాదిరిగా కావాలని కోరుకోవడమంటే .. హింసనే ప్రేరేపించడమేననని స్పష్టంచేశారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి, కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ .. ఈ విధంగా మాట్లాడటం సరికాదని పేర్కన్నారు.
రెచ్చగొట్టడం ఏంటీ ?
కేంద్ర హోంమంత్రిగా అంతర్గత భద్రతను కాపాడేలా మాట్లాడాలే తప్ప.. రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు వినోద్ కుమార్. బెంగాల్ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అహింస పునాదుల మీద ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తే .. చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఉన్న చోట అభివృద్ధి సాధ్యమని .. హింస ఉన్న చోట వృద్ధికి తావులేదని గుర్తుచేశారు.

వ్యతిరేక ఎజెండా
అమిత్ షా ఎజెండా తెలంగాణ వ్యతిరేక ఎజెండా అని తీవ్రస్థాయిలో విమర్శించారు వినోద్ కుమార్. తెలంగాణలో బీజేపీ పార్టీని విస్తరించుకోవాలంటే విస్తరించుకోండి .. కానీ శాంతికి మాత్రం విఘాతం కలిగించొద్దని తేల్చిచెప్పారు. ఇరు పార్టీలు వీధి పోరాటాలు కాదు .. సైద్ధాంతిక పోరాటం చేద్దాం సవాల్ విసిరారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చేసిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్కు అతి తక్కువ నిధులు కేటాయించారని మండిపడ్డారు. రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని .. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎన్ని పెన్షన్లు ఇస్తుందో తెలియజేయాలని సవాల్ విసిరారు. ఇటు కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ప్రాణహిత, చేవెళ్లి తెచ్చినప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ జాతీయ హోదా ఎందుకీయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలంటే బీజేపీ, కాంగ్రెస్లకు పట్టవని విమర్శించారు.












Click it and Unblock the Notifications