మాజీ ప్రియుడు.. పెళ్లిచేసుకోలేదని.. యాసిడ్ పోసేశాడు!
వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం యాసిడ్ దాడికి గురైన యువతి ఉదంతంలో నిందితుడు ఆమె మాజీ ప్రియుడేనని తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోలేదన్న అక్కసుతో ఆగ్రహం పట్టలేక అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Recommended Video
హైదరాబాద్: వరంగల్ అర్బన్ జిల్లాలో బుధవారం యాసిడ్ దాడికి గురైన యువతి ఉదంతంలో నిందితుడు ఆమె మాజీ ప్రియుడేనని తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోలేదన్న అక్కసుతో ఆగ్రహం పట్టలేక అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు యాసిడ్ దాడికి గురైన యువతిని మట్టెవాడకు చెందిన మాధురిగా గుర్తించారు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరడంతో ఎమర్జెన్సీ కేసుగా భావించిన ఎంజీఎం ఆసుపత్రి వైద్యనిపుణులు ఆమెను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఆమె 80 శాతం గాయపడడంతో కొన్ని గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో కొన్ని వివరాలు తెలిశాయి. మాధురికి నాలుగేళ్ల క్రితం వివాహం జరగగా ఒక కుమార్తె ఉంది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న మాధురి ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం చందు అనే ఆటోడ్రైవర్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతలోనే విభేదాలు తలెత్తడంతో పెళ్లి చేసుకోలేదు.
దీంతో చందు... మాధురిపై కక్ష పెంచుకున్నాడు. అదను చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు మాధురి చెల్లెలు ఆరోపించింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో మాధురి రెండోదని, తన సోదరి చాలా మంచిదని ఆమె చెబుతోంది.
మరోవైపు యాసిడ్ దాడికి పాల్పడిన చందు పరారీలో ఉన్నాడు. వారం రోజుల క్రితం కూడా ఇంటికి వచ్చి తన సోదరిని బెదిరించాడని మాధురి చెల్లెలు చెబుతోంది. బుధవారం ఆటోలో చందు తన సోదరిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లాడని, చివరికి ఇంతకు తెగించాడని ఆమె ఆరోపిస్తోంది.