తిరుమల లడ్డూ: టీటీడీకి తెలంగాణ విజయ డెయిరీ కీలక ప్రతిపాదన
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక ప్రకటన చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ప్రసాదాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విజయ డెయిరీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ జేవో జే శ్యామలరావుకు లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పంపినట్లు పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ ప్రసిద్ధి చెందిందని ఆ లేఖలో పేర్కొన్నారు. వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసిన చరిత్ర ఉంది. విజయ డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యత నిర్ధరించడంతోపాటు లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతోందని పేర్కొన్నారు.

టీటీడీకి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి తమ సంస్థ సన్నద్ధతలను తెలియజేస్తున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాలో స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దేవస్థానం, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజయ డెయిరీ ఆ లేఖలో టీటీడీని కోరింది. దీనిపై టీటీడీ నుంచి స్పందన రావాల్సి ఉంది.
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందంటూ నివేదికలు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా స్పందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి ప్రసాద పవిత్రను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications