హైదరాబాద్ లో భారీవర్షం.. రాష్ట్రమంతా వర్షాభావం.. విచిత్ర వాతావరణం!!
తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో ఇటీవల కాలంలో తరచూ భారీ వర్షం కురుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ హైదరాబాద్లో మాత్రం ఇటీవల కాలంలో తరచూ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్లో ఈరోజు కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది .ఇది ఇలా ఉంటే రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు హైదరాబాద్ నగరంలోనూ ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవడంతో వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట్, రాజేంద్రనగర్ ,అత్తాపూర్, కిస్మత్ పుర, యూసుఫ్ గూడా, లంగర్ హౌస్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, శివరాంపల్లి, గండిపేట తదితర ప్రాంతాలలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాదర్ఘాట్, మలక్ పేట్, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్నగర్, చంపాపేట్, చైతన్యపురి పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు డ్రైనేజీలు పొంగిపొర్లి నగరవాసులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు
కొన్నిచోట్ల ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. టోలిచౌక్ గోల్కొండ వాహనదారులకు చెట్లు విరిగిపడడంతో వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాలలో వర్షాలు కురవడం లేదు. ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
గతానికి భిన్నంగా తెలంగాణా వాతావరణం
ఇక రైతులు వరుణదేవుడు కరుణించాలని కప్పతల్లి పూజలు చేస్తూ, కప్పల పెళ్లిళ్లు చేస్తున్నారు. చాలా చోట్ల ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. ఇప్పటికే పత్తి విత్తిన రైతులు మొలకలు వచ్చిన వాటిని కాపాడుకోవడానికి ట్యాంకర్లతోనూ, స్ప్రింక్లర్లతోనూ నీటిని పోస్తూ నానా అగచాట్లు పడుతున్నారు. మరోవైపు వర్షం పడని ప్రాంతాలలో ఉక్కుపోత ప్రజలకు ఊపిరాడకుండా చేస్తుంది. గతానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఈసారి ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications