కెసిఆర్! 107 సభల్లో ఏంచెప్పావ్, 10న బంద్!: కోమటిరెడ్డి, ట్యాంక్బండ్పై కాకా విగ్రహం
హైదరాబాద్: ఎన్నికల సమయంలో 107 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం చెప్పారో చూడాలని, దీనిపై ప్రభుత్వం, కెసిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం అన్నారు.
సభ నుంచి విపక్షాలను సస్పెన్షన్ చేసిన అనంతరం... వారు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతాల్లో పర్యటించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రేపు మహబూబ్ నగర్, ఎల్లుండి మెదక్, 8న కరీంనగర్, 9న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
మరోవైపు, బిజెపితో కలిసి ప్రభుత్వంపై గళమెత్తాలని టిడిపి నిర్ణయించింది. గాంధీ విగ్రహం ముందు ఆందోళన సందర్భంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రూ.లక్ష రుణమాఫీ చేస్తామని కెసిఆర్ ప్రకటించారని, రైతుల ఓట్లతో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు.
రైతుల ఓట్లతో గెలిచిన కెసిఆర్... ఇప్పుడు వారిని బిచ్చగాళ్లు అనేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకేసారి రుణమాఫీ చేయాల్సిందేనన్నారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కావన్నారు. ఎన్నికలకు ముందు 107 సభల్లో కెసిఆర్ ఏం చెప్పారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని, రైతు ఆత్మహత్యల పైన తాము రాజకీయం చేయడం లేదన్నారు. రాజకీయం చేసేందుకు ఇప్పుడేమీ ఎన్నికలు లేవన్నారు. రైతులకోసం మేం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. రుణమాఫీ చేయకుంటే 10న బందుకు యోచిస్తున్నామన్నారు.
ట్యాంక్బండ్పై వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
ట్యాంక్బండ్ పైన తెలంగాణ నేత కాంగ్రెస్ పార్టీ నేత జి వెంకట స్వామి (కాకా) విగ్రహావిష్కరణ సోమవారం జరిగింది. అంబేద్కర్ విగ్రహం వెనుక ఏర్పాటు చేసిన పార్కులో కాకా విగ్రహాన్ని సీఎం కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూధనా చారి, కేంద్రమంత్రి బండారు దత్రాత్రేయ, కాకా కుమారులు వినోద్, వివేక్తోపాటు పలువురు కాకా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలను జరిపారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ... కాకా దళిత నేత మాత్రమే కాదని, అందరి నేత అన్నారు. కెసిఆర్ మాట్లాడుతూ... కాకా విగ్రాహాన్ని ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందన్నారు. కాకా చేసిన సేవలను కొనియాడారు. వెంకట స్వామి రాజకీయ భీష్ముడు అన్నారు.
సుధీర్ఘ రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం ఉన్న నిజమైన తెలంగాణ బిడ్డ అన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ట్యాంక్బండ్పై కాకా విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ దెబ్బ తగిలినా భయపడకుండా ముందుకు వెళ్లారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రస్తావన వస్తే చాలు అవును తెలంగాణ రాకూడదా, తెలంగాణ రావాల్సిందేనని కరాఖండిగా చెప్పేవారని గుర్తు చేశారు. చిన్నస్థాయి నుంచి మనిషి పెద్దస్థాయికి ఎదగగలడనేందుకు కాకా నిదర్శనమన్నారు. ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగిన దళిత నేత అని శ్లాఘించారు. పేదల కోసం, దళితుల కోసం అహర్నిశలు శ్రమించారన్నారు.
కాకా ఆస్పత్రిలో ఉన్నపుడు తాను వెళ్లి కలిశానని అప్పుడు వెంకటస్వామి తనకు తెలంగాణ వచ్చిన తర్వాత చూసే కన్ను మూయాలని ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. చివరికి తెలంగాణను చూశాకే స్వర్గస్థుడయ్యారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా తెలంగాణ రాష్ర్టాన్ని చూడాలని కోరుకునే వారని కానీ చూడకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.