ధర్నాలు చేస్తేనే జైల్లో పెడితే.!కబ్జాలు చేస్తున్న మంత్రిని ఏం చేయాలి.?సూటిగా ప్రశ్నించని ఎన్ఎస్ యూఐ.!
హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసారు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉంటేనే తప్ప ఎదుటి వారిపై ఆరోపణలు చేయనని స్పష్టం చేసారు. మీడియా ముఖంగా అందరికీ చెప్పిన విధంగానే మంత్రి మల్లారెడ్డి అధికార దూర్వినియోగాన్ని ఒక్కొకటిగా బట్టబయలు చేస్తున్నానని బాల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం జవహార్ నగర్ మున్సిపాలిటీ 15వ వార్డులోని సర్వే నంబర్ 488 పై ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన సీఎంఆర్ హాస్పిటల్ ని గతంలో తాజా మాజీ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అదే విధంగా మంత్రి మల్లారెడ్డి ప్రారంభించడం జరిగిందని ఇది వందకు వంద శాతం చట్టాన్ని ఉల్లంఘిచి కట్టిన నిర్మాణం అని వెంకట్ తెలిపారు.
మంత్రి ప్రోద్బలంతో జరిగిన అక్రమాలపై స్థానిక ప్రజలు, మీడియా మరియు పాత్రికేయ సోదరులు ప్రశ్నించడంతో 2020 సెప్టెంబర్ 9వ తేదీ మరుసటి రోజు స్థానిక అధికారులు వచ్చి హాస్పిటల్ ను మూసెయ్యడం జరిగిందని వెంకట్ స్పష్టం చేసారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత మంత్రి మల్లారెడ్డి ఎస్వీ హాస్పిటల్ యాజమాన్యానికి ఈ హాస్పిటల్ ని అప్పగించారని, తర్వాత మంత్రిహోదాలో స్వయంగా తానే వచ్చి తిరిగి ఈ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అధికారం ఉందని తమతో ఏదైనా సాధ్యమనే భావం కలిగిన ఇలాంటి నాయకుల భరతం పట్టాలని వెంకట్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించిన ఆసుపత్రును స్వాధీన పరచుకుని వీటిని వెంటనే ఉచిత కోవిడ్ సెంటర్లుగా మార్చాలని వెంకట్ డిమాండ్ చేశారు.