ఓటుకు నోటు: ఎమ్మెల్యే సండ్ర ఎక్కడ? లేఖపై ఏసీబీ ఏం చేస్తుంది?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్వవహారంలో నోటీసులు అందుకున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీకి లేఖ రాసిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తి చోటు చేసుకుంది. వెన్నునొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని, ఇప్పుడే కోలుకుంటున్నానని ఆ లేఖలో సండ్ర చెప్పారు.
అయితే ఏసీబీ అధికారులు మాత్రం సండ్ర వెంకట వీరయ్య రాసిన లేఖ ఇంకా తమకు అందలేదని అన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ లేఖ అందింతే ఏసీబీ ఏ విధమైన చర్యలకు దిగుతుందనేది ప్రశ్న. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణను సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులు చాలా పకడ్బందీగా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే సండ్ర వెంకట వీరయ్యను విచారణకు హాజరు కావాలని మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోగా హాజరు కావాలంటూ సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు.
తాను పర్యటనలో ఉండగా వెన్ను, కుడికాలుకు తీవ్ర నొప్పి వచ్చిందని, వైద్యులను సంప్రదిస్తే పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, కోలుకున్న తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, ఒకవేళ ఏసీబీ అధికారులు ఆసుపత్రికి వచ్చినా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో ప్రస్తావించారు.
దీంతో ఎమ్మెల్యే సండ్ర లేఖలో పేర్కొన్నట్లు ఏబీసీ అధికారులు దీనిని పరిగణలోనికి తీసుకుని ఆసుపత్రికే వెళ్లి విచారిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
అక్కడ కూడా ఆయన తన సొంత పేరుతో కాకుండా, వేరే రోగి పేరుతో చేరినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆస్పత్రి యజమాని ఆయనకు సన్నిహిత మిత్రుడు కావడంతో, అక్కడే చేరారని అంటున్నారు. ఈ విషయాన్ని కార్పోరేట్ ఆసుపత్రి వర్గాలు మాత్రం క్కడా ధ్రువీకరించడం లేదు.
ఏసీబీ అధికారులు ఎవరినీ సంప్రదించినా ఎవరికి వారు తమ ఆస్పత్రిలో చేరలేదనే చెబుతున్నారు. అంతే కాదు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా సండ్ర వెంకట వీరయ్య ఇక్కడకు వచ్చారన్న విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వడం లేదు. ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు.
అయితే, తెలంగాణ పోలీసులు కూడా ఇందుకు ధీటుగానే వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వులు తీసుకుని, వాటి సాయంతో వాళ్లు సండ్ర వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కాబట్టి లేఖను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
ఓటుకు నోటు కేసు కీలకదశలో ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేకు చికిత్స అందించిన వైద్యులను కూడా కలిసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. వైద్యులను కలిసిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితిపై పూర్తి నివేదికను పరిశీలించిన మీదట ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.