అవే బాధించాయి, చెన్నై వెళ్లిపోతా, నా పాత్ర ముగిసింది! విభజన టైంలో..: నరసింహన్
తాను ఎక్కువగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నాననే మాటలు తనను బాగా బాధించాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు.
హైదరాబాద్: తాను ఎక్కువగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నాననే మాటలు తనను బాగా బాధించాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు.
చదవండి: గవర్నర్ పొడిగింపు వెనుక..
ఆయన టీవీ ఛానల్తో మాట్లాడారు. ప్రజల సంక్షేమంపై రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెట్టడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధిలో రెండు ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు.

విభజన సమయంలో ఒత్తిడికి లోనయ్యా.. మనస్పర్థలు గతం
రాష్ట్ర విభజన సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని నరసింహన్ చెప్పారు. రాత్రుళ్లు నిద్ర పట్టేది కాదన్నారు. తెల్లవారి నిద్రలేచాక.. అమ్మయ్య నిన్న అయిపోయింది అనుకునేవాడిని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య మనస్పర్థలు గడిచిపోయిన విషయాలు అని నరసింహన్ అన్నారు.

ఇద్దరు సీఎంలు అటు ఇటు..
ఇద్దరు ముఖ్యమంత్రులు అటూ ఇటూ పర్యటించాలన్నది తన భవిష్యత్ స్వప్నం అన్నారు. తాను, ఎప్పటికైనా చెన్నైకి వెళ్లిపోతానని నరసింహన్ అన్నారు.
ప్రజల కేంద్రంగా అభివృద్ధి ఉండాలనే తన ఆకాంక్ష అని గవర్నర్ నరసింహన్ అన్నారు. చత్తీస్గఢ్లో ప్రజల కనీస అవసరాలపై దృష్టి సారించానని, ఇప్పుడు కనీసం తెలుగు రాష్ట్రాల్లోను అదే చేస్తున్నానని చెప్పారు.

ఇదీ తన పాత్ర
ఆరోగ్యం, విద్య విషయాల్లో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తనది శాంతికాముకుడి పాత్ర అని చెప్పారు. తన పాత్ర ముగిసిందనే అనుకుంటున్నానని, అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు.

హైదరాబాద్ శాంతియుత నగరం
నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాలు తలపడినప్పుడు సానుకూల వాతావరణంలో సమస్యను పరిష్కరించానని చెప్పారు. హైదరాబాద్ అత్యంత శాంతియుత నగరమని చెప్పారు. హైదరాబాద్ భద్రతపై అందరూ భయపడ్డారని, కానీ ప్రశాంతంగా ఉందన్నారు. తాను వచ్చినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉండెనని చెప్పారు.

కేరీర్ ఇక్కడే ముగిస్తా
తన కెరీర్ను ఇక్కడే ముగిస్తానని, ఆ తర్వాత చెన్నై వెళ్తానని చెప్పారు. కాగా, నరసింహన్ పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications