'కెసిఆర్కు బాబు ప్రాధాన్యత ఎందుకు?: ఆ టైంలో ఏం మాట్లాడారు?'
హైదరాబాద్/గుంటూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం పైన విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కెసిఆర్కు చంద్రబాబు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు.
చంద్రబాబు ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సీఎంను పిలవగా, ఫోన్ ట్యాపింగ్ సమస్య కారణంగా కెసిఆర్ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కాగా, దీనిపై టిఆర్ఎస్, టిడిపిల్లోను చర్చ సాగుతోందని తెలుస్తోంది. కెసిఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం టిఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల సిఎంలు ఒకరినొకరు ప్రత్యర్థులుగానే చూసుకుంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. అప్పటి వరకు వారంలో నాలుగు రోజులు విజయవాడలో మకాం వేస్తాను అని చెప్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు హటాత్తుగా పూర్తిగా విజయవాడకు మకాం మార్చారు. అప్పటి నుంచి ఓటుకు నోటు కేసు విచారణ మందగించిందనే విమర్శలున్నాయి.
రాజధాని శంకుస్థాపనకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన సమయంలో కెసిఆర్ - చంద్రబాబులు ఇరవై నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ చర్చల సారాంశం ఏమిటో బహిరంగ పరచాలని వైసిపి, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి.
ఏమైనప్పటికీ ఇద్దరి మధ్య ఏకాంత చర్చ విపక్షాలకు ఆయుధంగా మారింది. మరోవైపు కెసిఆర్కు స్వాగతం పలుకుతూ విజయవాడలో బ్యానర్లు కూడా వెలిశాయి. కెసిఆర్ అమరావతికి వెళ్లడేమోననే అభిప్రాయం మొదట్లో కలిగించారు. ఆహ్వానిస్తే వెళ్లి ఆశీర్వదిస్తామని కెటిఆర్ తొలుత ప్రకటించారు.
కెటిఆర్ నాయకత్వంలో ఒక బృందం వెళ్లవచ్చునని టిఆర్ఎస్ నాయకులు తొలుత తెలిపారు. కానీ చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించిన తర్వాత కెసిఆర్ తాను అమరావతి వస్తున్నానని చెప్పారు. తద్వారా కెసిఆర్ బాబుకు, బాబుకు కెసిఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. దీనిపై టిడిపి, టిఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.