వరదలపై కిషన్ రెడ్డి ఇప్పుడొచ్చి రాజకీయాలు చేస్తారా? భగ్గుమన్న బీఆర్ఎస్!!
వరంగల్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, పునరావాస కేంద్రాలలో ఉన్న వరద బాధితులను పరామర్శించడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.
జాతీయ విపత్తుల నిధులు 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వీటిలో 75 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవని పేర్కొన్న కిషన్ రెడ్డి వరద బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వరదలతో చనిపోయిన కుటుంబాలకు అందిస్తున్న నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం లో కూడా 3లక్షల రూపాయలు కేంద్రప్రభుత్వం ఇస్తుందని, లక్ష రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో వరద నష్టాలపై కేంద్రానికి ఎటువంటి నివేదికలు అందలేదని, వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడానికి సరిగ్గా పనిచేయడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ సమావేశం నిర్వహించి మరీ కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి రాజకీయాలు చేయడం దేనికని ప్రశ్నించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనో ధైర్యం ఇచ్చి అండగా నిలవాల్సిన బాధ్యత గల నాయకుడిగా ఉండాల్సింది పోయి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటు అని అన్నారు. ఆపత్కాలంలో వీలు అయితే ప్రజలకు అండగా ఉండండి కాని రాజకీయం చేయకండి అని అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద బాధితులకు అండగా ఉంటారని ఆశించాము కానీ రాజకీయాలు చేయడానికి వచ్చారని విమర్శించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలోనే వచ్చారన్నారు. కిషన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు వస్తే బాగుండేదని వరదలు తగ్గిన నాలుగురోజుల తర్వాత వచ్చారన్నారు. మేం కష్టపడి పనిచేసి బాధితులకు అండగా నిలిచామన్నారు. కానీ బిజెపి అధ్యక్షుడిగా వచ్చిన కిషన్ రెడ్డి వరదలపై రాజకీయం చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ రోడ్స్ నిధులు సకాలంలో విడుదల చేస్తే పనులు పూర్తయ్యేవన్నారు. వరదల ప్రభావం ఇంతగా ఉండేది కాదని పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ఏం చేస్తారో కిషన్ రెడ్డి స్పష్టత ఇస్తే బాగుండేదన్నారు. అలా కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధుల కింద 196 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వ వాట కింద 213 కోట్లు కేటాయించడం జరిగింది అని తెలిపారు.కేంద్రం తన వాట లో పెండింగ్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందన్నారు.కేంద్రం తన వాట నిధులు విడుదల చేస్తే రాష్ట్రం తన వాట నిధులు విడుదలకి సిద్ధం గా ఉంది అని తెలిపారు.












Click it and Unblock the Notifications