మహిళ ఘాతుకం: ఫుల్లుగా తాగేసి భర్తను చంపేసింది
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. తాగిన మైకంలో భర్తను చంపేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో గల చింతలబస్తీలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా గౌరరం గ్రామానికి చెందిన వెంకటేష్, సుగుణ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చారు.
కూలీ పనులు చేసుకునే వెంకటేష్కు కాలు విరిగింది. దీంతో అతను ఇంటి వద్దనే ఉంటున్నాడు. కుటుబ భారమంతా సుగుణపై పడింది. ఈ స్థితిలో దంపతులిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఆదివారం రాత్రి దంపతులు మద్యం సేవించి గొడవ పడ్డారు.
ఆగ్రహంతో రెచ్చిపోయిన సుగుణ రాడ్తో భర్త తలపై బలంగా కొట్టింది. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం బయటకు రాలేదు.
చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు సాగిస్తున్నారు.