సీఎం కేసీఆర్పై మరోసారి ఫైర్ అయిన వైఎస్ షర్మిల... సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితా...?
తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల... మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేశారు.సీఎం జిల్లా అని చెప్పుకొనే మెదక్ జిల్లాలో 20 కరువు మండలాలు ఉండటం దారుణమన్నారు. పటాన్చెరులో కాలుష్యం కోరలు చాస్తోందని... మల్లన్నసాగర్కి భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. బుధవారం(మార్చి 31) మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల మాట్లాడారు.
మెదక్ జిల్లాలో దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని షర్మిల ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం మెదక్ నుంచే ప్రారంభించారని షర్మిల గుర్తుచేశారు.పాటకు ప్రాణం పోసి, విప్లవానికి ఊపిరిలూదిన గద్దర్ పుట్టిన గడ్డ మెదక్ అన్నారు. నాగేటి సాలల్లో నా తెలంగాణ అన్న నందినీ సిధారెడ్డి పుట్టిన నేల మెదక్ అని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో 5.19 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనుకున్నారని షర్మిల వెల్లడించారు.కానీ ఇప్పటి పాలకులు ప్రాజెక్టు రీ డిజైన్ చేసి ఏం చేశారో తెలియదన్నారు.
ఇటీవల ఖమ్మం సంకల్పం సభ పోస్టర్ రిలీజ్ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని... ప్రజల ఆశీస్సులు... ఆపై భగవంతుడి దయ తమపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని... రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9వ తేదీనే తొలి అడుగు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
కాగా,ఈ నెల 9న ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి లక్ష మంది జన సమీకరణతో భారీ ఎత్తున ఈ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ కోవిడ్ 19 పరిస్థితుల రీత్యా జనం 6వేలకు మించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సభకు అనుమతినిచ్చారు. ఈ సభా వేదిక నుంచే షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నారు. పార్టీ ఎజెండా,భవిష్యత్ కార్యాచరణను ఈ సభలో వెల్లడించే అవకాశం ఉంది.