రేపు గవర్నర్ తమిళిసైని కలవనున్న వైఎస్ షర్మిల: టీఆర్ఎస్ సర్కారుపై ఫిర్యాదులు!
హైదరాబాద్: దాడులు, తనను అరెస్ట్ చేసిన తీరును రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వివరించనున్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గురువారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళైని ఆమె కలవనున్నారు. ఈ సందర్భంగా తనపై దాడి, అరెస్టు తదితర వివరాల గురించి గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు.
కాగా, ఇప్పటికే షర్మిలను అరెస్ట్ చేసిన తీరును గవర్నర్ తమిళిసై తప్పుబట్టారు. వైయస్సార్టీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిల కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్విట్టర్ వేదికగా గవర్నర్ స్పందించారు. దాడులు, షర్మిల అరెస్టుపై బీజేపీ కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, మంగళవారం రాత్రి బెయిల్ పై విడుదలైన తర్వాత షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రజల పక్షాణ నిలబడటం తప్పా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా? అని నిలదీశారు. ఇది ఏమైనా ఆప్ఘనిస్తానా? కేసీఆర్ తాలిబన్ నాయకుడా? అని ప్రశ్నించారు షర్మిల. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అడుగడుగునా టీఆర్ఎస్ అడ్డుకుందన్నారు.
తమ ఫ్లేక్సీలను దగ్ధం చేయడం, ఇబ్బందులు పెట్టడంతోపాటు తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ గూండాలు దాడులు చేశారని మండిపడ్డారు షర్మిల. తానుండే బస్సును కూడా తగలబెట్టారని చెప్పారు. టీఆర్ఎస్ గూండాలు తమ పార్టీ నేతలు వాహనాలపై రాళ్ల దాడులు చేశారని, కొట్టారని తెలిపారు. దాడులు చేసినవారిమీద కేసులు పెట్టకుండా.. తనను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారని పోలీసులపై మండిపడ్డారు షర్మిల.