మాట తప్పదు.. మడమ తిప్పదు వైఎస్సార్ బిడ్డ.. షర్మిలను ఆదరించాలన్న విజయమ్మ!!
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో దూకుడుగా ముందుకు వెళుతుంది వైయస్ షర్మిల. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. నాటి వైఎస్సార్ సంక్షేమ పాలన ను గుర్తు చేసి, నేటి కేసీఆర్ అరాచక పాలన కు చరమగీతం పాడాలని, సంక్షేమ పాలన కోసం వైయస్ఆర్ బిడ్డను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేస్తుంది.

వైఎస్ షర్మిలకు బాసటగా విజయమ్మ
ఇక ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను, మంత్రి ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వైయస్ షర్మిల ప్రతి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, నియోజకవర్గ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను, మంత్రుల తీరును ఏకరువు పెడుతున్నారు. వైయస్సార్ పాలనకు, ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఇక వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు మద్దతుగా వైఎస్ విజయమ్మ కూడా షర్మిలతోపాటు నియోజకవర్గాల పర్యటన చేస్తున్నారు.

షర్మిల మాట తప్పదు మడమ తిప్పదు
వైయస్ఆర్ బిడ్డ మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలని ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని వైయస్ విజయమ్మ తనదైన శైలిలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగు చేయాలన్న ఉద్దేశంతో వైయస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారని, తాను మంచి చేయాలనుకుంటే, ఖచ్చితంగా చేసి తీరుతుందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం వైయస్ షర్మిల కు ఉందని, ప్రజల కోసం తపన పడుతున్న షర్మిల ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుందని వైయస్ విజయమ్మ తేల్చిచెప్పారు.

షర్మిలను నమ్మాలన్న వైఎస్ విజయమ్మ
మాట తప్పని మడమ తిప్పని వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఆయన రక్తం పంచుకున్న షర్మిలకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్న వైఎస్ విజయమ్మ, తన తండ్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాడో అదేవిధంగా వైయస్ షర్మిల కూడా పని చేస్తుందని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు షర్మిలను నమ్మాలని, వచ్చే ఎన్నికలలో షర్మిలకు ఒక అవకాశం ఇవ్వాలని విజయమ్మ ప్రజలను కోరారు.

కూతురిని ఆదరించాలని కోరుతున్న విజయమ్మ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ నాయకుడికి, నాయకుల పిల్లలకు ఎవరికి తెలంగాణ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని, వారు ప్రజల కోసం చేసిందేమీ లేదని వైయస్ విజయమ్మ తేల్చిచెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో 2500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కుమార్తె వైఎస్ షర్మిల తో కలిసి పాల్గొన్న వైఎస్ విజయమ్మ ఈ మేరకు తన బిడ్డను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications