TTD: చిరుతల టెన్షన్, ఎలుగుబంటి హల్ చల్ - భక్తుల్లో ఆందోళన..!!
Tirumala: తిరుమలలోని శేషాచల కొండల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. తిరుమల కాలినడక మార్గంలో లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడం కలకలం సృష్టించింది. దీంతో, టీటీడీ అప్రమత్తం అయింది. దాదాపు 25-30 చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఎలుగుబంటి కనిపించటం కలకలంగా మారింది. దీంతో, కాలినడకన మార్గంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఎలుగుబంటి కలకలం
లక్షిత వ్యవహారంతో టీటీడీ కాలినడక మార్గంలో పలు ఆంక్షలు విధించింది. ఈ ఉదయం ఒక చిరుత బోన్ లో చిక్కుకుంది. గత 45 రోజుల వ్యవధిలో రెండు చిరుతలను ఇదే ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

కాలిబాట అటవీ మార్గంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో త్వరలోనే అధ్యాయనం చేస్తామన్నారు. నడక మార్గానికి సమీపంలోని కిలో మీటర్ పరిధిలో 500 కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్ని చిరుతలు సంచారిస్తున్నాయో గుర్తిస్తామన్నారు. 7వ మైల్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేస్తున్నారు.
కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
ఈ ఆపరేన్ కొనసాగిస్తున్న సమయంలో ఈ ఉదయం నడక మార్గంలో 2000 మెట్టు వద్ద ఎలుగుబంటి కనిపించింది. దీంతో, భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేసారు. కొద్ది రోజుల క్రితం మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం సీసీ కెమేరాలో కనిపించింది. తిరుమలకొండ నామాలగవి ప్రాంతంలో మరో చిరుత సంచరించిందనే ప్రచారాన్ని టీటీడీ ఖండించింది.
చిరుతలు ఉదయం సమయంలో బయటకు రావని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నడకదారుల్లో పిల్లల అనుమతిపై పలు ఆంక్షలు విధించింది. 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
దివ్యదర్శనం రద్దు..సర్వదర్శనం పెంపు
రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. ఏడవ మైలు వద్ద నుంచి చిన్న పిల్లల చేతికి పోలీసులు ట్యాగ్ వేస్తున్నారు.
తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ట్యాగులపై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ను సిబ్బంది జతపరుస్తున్నారు. ఇదే సమయంలో నడకదారి భక్తులకు కల్పించే దివ్య దర్శనం రద్దు దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఈ స్థానంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను 15 వేల నుంచి 30 వేలకు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగే సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications