మళ్లీ మునిగిన తిరుపతి: ఆ నాలుగు జిల్లాల్లో కుండపోత: ఏకధాటిగా ఒకటే వర్షం
తిరుపతి: బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం అప్పుడే విజృంభణ మొదలు పెట్టింది. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై విరుచుకుపడుతోంది. ఈ తెల్లవారు జాము నుంచి ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే కుంభవృష్టితో అల్లకల్లోలంగా మారిన తిరుపతి.. ఇప్పుడీ తాజా వర్షాలతో మరింత అల్లాడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి.
హుస్సేన్ సాగర్లో పల్టీ కొట్టిన కొత్త కారు: ముగ్గురికి గాయాలు..
అతి భారీ వర్షాలతో..
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన రెండుసార్లు అల్పపీడనం ఏర్పడింది. దాని తీవ్రత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైనే కనిపించింది. ఇప్పుడు తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కూడా ఇవే జిల్లాలపై పడింది. ఈ అల్పపీడనం వాయుగుండం మారుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. సోమవారం ఇది వాయుగుండంగా మారుతుంది. 30 లేదా డిసెంబర్ 1వ తేదీన ఏపీ దక్షిణ ప్రాంతం, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం మధ్య తీరాని దాటొచ్చని అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ కుంభవృష్టి..
దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. కుండపోతగా వర్షాలు కురుస్తోన్నాయి. ఈ తెల్లవారు జాము నుంచి ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురంలల్లో అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. కర్నూలుపై దీని తీవ్రత తక్కుగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఇలా వెంటవెంటనే అతి భారీ వర్షాలను చవి చూడటం వల్ల రాయలసీమ జిల్లాలు నిండుకుండలా తయారైంది.
పేరూరు గేట్లు ఎత్తివేత..
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో గల అన్ని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో పోటెత్తుతున్నాయి. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అనంతపురం జిల్లాలో గల పేరూరు రిజర్వాయర్ 25 సంవత్సరాల తరువాత గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పెన్నా నదిపై నిర్మించిన రిజర్వాయర్ ఇది. గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో ఒక గేటును ఎత్తి.. నీటిని దిగువకు వదిలివేస్తోన్నారు అధికారులు.
కడప-తిరుపతి మార్గం మళ్లీ ధ్వంసం..
కడప జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల ధాటికి కడప-తిరుపతి రోడ్డు మార్గం మొత్తం జలమయమైంది. ఈ మార్గంలో ఉన్న బాలపల్లె వద్ద రోడ్డు కుంగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. కడప జిల్లా వైపు నుంచి తమిళనాడుకు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడం వల్ల భారీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు ముందుకు కదల్లేని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు వాహనదారులు.
కడప-నెల్లూరు రోడ్లు జలమయం..
కడప జిల్లా నుంచి చిట్వేలు, రాపూరు మీదుగా నెల్లూరు జిల్లాకు వెళ్లే మార్గం జలమయమైంది. ఈ మార్గంలో పలుచోట్ల వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తోన్నారు. మూడు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోన్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, అనంతపురం జిల్లా కదిరి, గోరంట్ల, హిందూపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.