వైకుంఠ ఏకాదశికి సిఫారసు వద్దు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి
వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ సారి 13వ తేదీన వచ్చింది. ఆ రోజున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరతారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు పదిరోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ప్రముఖులు ఎవరు సిఫారసు లేఖ పంపవద్దని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో ముందుగా దర్శనం టికెట్ బుక్ చేసుకున్న సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుని టీటీడీకి సహకరించాలని ఆయన కోరారు.
10 రోజుల పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా తిరుమలలో గదుల మరమ్మతులు చేపట్టినందు వల్ల వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు తిరుమలలోని నందకం, వకుళ అథితి గృహాల్లో వసతి కల్పిస్తున్నామని, ఒక వేళ తిరుమలలో వసతి సరిపోకపోతే తిరుపతిలో బస పొందేందుకు సిద్ధపడి రావాలన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుపతిలో మాధవం, శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయం, ఎస్వీ గెస్ట్ హౌస్లో వసతి పొందాలని ఆయన తెలిపారు. పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విఐపిల దర్శన సమయం వీలైనంత తగ్గించి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనానికి కేటాయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమల పుణ్యక్షేత్రానికి సంక్రాంతి సీజన్ లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. స్వామివారి దర్శనానికి ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరుమలలో గదులు లభ్యం కాకపోతే తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మరమ్మతు పనుల వల్ల గదుల కొరత ఉందని అన్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లు గలవారు తిరుపతిలో గదులు తీసుకోవాలని సూచించారు.