తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ: 9 చోట్ల కౌంటర్లు- 4 లక్షలకు పైగా
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తోన్నారు. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం, ఆకాశదీపం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సోమవారం నాడు 67,198 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22,452 మంది తలనీలాలను సమర్పించారు. 21 కంపార్ట్మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి 12 గంటల సమయం పట్టింది. హుండీ ద్వారా 4.19 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనుంది టీటీడీ. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రోజూ లక్షమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శిస్తారని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. వారికి అవసరమైన వసతి సౌకర్యాన్ని కల్పించనుంది.
తిరుపతిలో నేటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ చేయనుంది టీటీడీ. దీనికోసం మొత్తం తొమ్మిది చోట్ల ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను తీసుకోదలిచిన భక్తులు ఆయా కౌంటర్లను సంప్రదించాల్సి ఉంటుందని తెలిపింది.
తిరుపతి ప్రధాన బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణువాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల తిరుపతి గోవిందరాజ స్వామి సత్రాల్లో ఈ కౌంటర్లు ఏర్పాటయ్యాయి. అలిపిరి మెట్ల మార్గం సమీపంలో గల భూదేవి కాంప్లెక్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరా గ్రౌండ్స్లల్లో కౌంటర్లను టీటీడీ నెలకొల్పింది.
జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బైరాగి పట్టెడ వద్ద గల రామానాయుడు ఉన్నత పాఠశాల, తిరుపతి ఎంఆర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామచంద్ర పుష్కరిణి సమీపంలో వైకుంఠ ద్వార ఉచిత స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. నేటి నుంచి టికెట్ల జారీ మొదలవుతుంది. మొత్తం 4,23,500 టోకెన్లు అయిపోయేంత వరకూ ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications