శ్రీవారి బ్రహ్మోత్సవాలు : నేత్ర పర్వంగా గరుడ వాహన సేవ - పాల్గొన్న సీజేఐ..!!
శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి గరుడవాహనసేవ కన్నుల పండువగా సాగింది. తిరుమాఢ వీధుల్లో గరుత్మంతునిపై ఊరేగుతూ.. స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన గరుడ సేవ దాదాపుగా నాలుగున్నార గంటలకు పైగా కొనసాగింది. మూడు లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లుగా టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరువీధుల్లో విహరిస్తున్న స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి రావటంతో.. తిరుమాడ వీధుల్లో భక్త జనం పోటెత్తింది. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నిత్య వాహనం కావడంతో.. ఈ సేవను తిలకిస్తే సర్వ దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. వాహన సేవ జరగుతున్న సమయంలో.. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
అటు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాఢవీధుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోగాత్మకంగా చేపట్టిన దర్శనంలో చిన్నపాటి అవాంతరాలు ఎదురయ్యాయి. వెంగమాంబ అన్నదాన సత్రం సమీపంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచె కిందపడిపోయింది.
వాహనసేవ దర్శనానికి భక్తులను అనుమతించే సమయంలో ఇక్కడ చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎలాంచి అవాంచనీయ ఘటన జరగలేదు. గరుడ సేవను తిలకించేందుకు ప్రముఖులు తరలి వచ్చారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా తిరుమల వచ్చిన సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడవాహన సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటుగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, భారత ప్రభుత్వ రక్షణ శాఖ సాంకేతిక సలహదారు సతీష్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.