Tirumala: తిరుమలలో ఆ 20 మంది సిఫార్సు లేఖల పై నిఘా..!!
తిరుమలలో దర్శన టికెట్ల దందా వెలుగులోకి వస్తోంది. దీని పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. టీటీడీకి ఆదేశాలు ఇచ్చింది. ఎవరినీ ఉపేక్షించద్దని స్పష్టం చేసింది. తాజాగా ఎమ్మెల్సీ సాబ్జీ అంశం వెలుగు లోకి వచ్చిన తరువాత నిఘా పెంచింది.
20 మంది సిఫార్సు లేఖలు పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు. వీరి లేఖల పైన నిఘా పెంచారు. అధికార..ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఈ 20 మంది తిరుమలలో కొందరు మధ్యవర్తులతో పని కానిస్తున్నట్లు గుర్తించారు.

అధికారులు అప్రమత్తం: తిరుమల పాలక మండలి..అధికారులు అప్రమత్తం అయ్యారు. తాజా పరిణామాలతో దర్శన టికెట్ల దందా పై నిఘా పెట్టారు. సిఫార్సు లేఖల పైన ఫోకస్ చేసారు. 20 మంది ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు పక్క దారి పడుతున్నాయని తేల్చారు. వీరి లేఖల పైన నిఘా ఉంచాలని ఆదేశించారు.
రానున్న రోజుల్లో ఈ 20 మంది ఇచ్చే సిఫార్సు లేఖల విషయంలో క్షుణ్నంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. కొందరు ప్రజా ప్రతినిధులు, వారి సహాయకులు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని సిఫార్సు లేఖలు ఇస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిని అధికారులు పరిశీలిస్తున్నారు. తరచూ వచ్చే లేఖలు, టీటీడీ కార్యాలయం లో ఎవరు వాటిని దరఖాస్తు చేస్తున్నారనే అంశం పైన అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
అనుకూల వ్యక్తులతో: కొందరు ప్రముఖులు తిరుమల..తిరుపతిలో తమకు అనుకూల వ్యక్తులను నియమించుకున్నారు. తమ సిఫార్సు లేఖలను వారి ద్వారా జేఈవో కార్యాలయంలో దరఖాస్తు చేయిస్తారు. ప్రజాప్రతినిధులకు సంబంధిత వ్యక్తులుగా వారిని గుర్తించి టీటీడీ వారి లేఖల దరఖాస్తుకు టీటీడీ అనుమతిస్తోంది.
వారు తెచ్చిన సిఫార్సు లేఖలకు ఆమోద ముద్ర వేస్తోంది. పార్టీలకు అతీతంగా అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని పలువురు నేతలు తిరుమలలో తమ మధ్య వర్తులను నియమించుకున్నట్లు టీటీడీ గుర్తించింది. ఇప్పటి వరకు వారితో పాటుగా, వారి లేఖల ద్వారా దర్శనానికి వచ్చే వారి పైనా నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలు లేకుండా, సక్రమంగా లేఖల ద్వారా దర్శనం పొందే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని టీటీడీ స్పష్టం చేస్తోంది.
పెరుగుతున్న ఒత్తిడి: టీటీడీలో సాధారణంగా అధికారుల పైన ప్రజా ప్రతినిధుల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం శ్రీవారికి సంబంధించిన ఒక సేవ విషయంలో టికెట్ల కోసం వస్తున్న ఒత్తిడి తాను భరించలేక పోతున్నానని స్వయంగా ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో కొందరు మంత్రులు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం తమ అనుచరులతో రావటం కూడా వివాదాస్పదంగా మారుతోంది.
మంత్రుల వరకు ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తారు. తమతో వచ్చిన వారికి కూడా అదే తరహా దర్శనం కల్పించాలని మంత్రులు టీటీడీ అధికారుల పైన ఒత్తిడి తెస్తున్న సందర్భాలు బయటకు వచ్చాయి. సాధారణ భక్తుల పైన వీఐపీ దర్శనాల ప్రభావం పడుతోంది. దీంతో, సిఫార్సు లేఖల విషయంలో టీటీడీ ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.












Click it and Unblock the Notifications