Tirumala: నేరుగా శ్రీవారి దర్శనం - టీటీడీ తాజా నిర్ణయంతో..!!
Tirumala Srivari Darshanam: టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయం భక్తులకు వరంగా మారింది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు సాధారణ భక్తులకు కలిసి వచ్చింది. దీంతో, భక్తులు క్యూ లైన్లలో నిరీక్షణ.. కాంపార్టమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా పోయింది. రెండు రోజుల సమయంలోనే అందునా వారాంతంలోనే ఈ మర్పు కనిపించింది. దీంతో, బోర్డు తాజా నిర్ణయాన్ని సాధరణ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ అదే విధంగా కొనసాగుతున్నా.. దర్శనం మాత్రం సులభం అయింది. దీంతో, సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ మరిన్ని నిర్ణయాలకు సిద్దం అవుతోంది.
టీటీడీ పాలక వర్గం బ్రేక్ దర్శనాల సమయం మార్పు చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాల సమయం ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటలుగా నిర్ణయించారు. గతంలో తెల్లవారుజామున సమయంలో బ్రేక్ దర్శనం ఉండేది. బ్రేక్ దర్శనం పూర్తయ్యే వరకు సాధారణ భక్తులను క్యూ లైన్లలో నిలిపివేసారు. కొందరు కంపార్టుమెంట్లలో వేచి చూడాల్సి వచ్చేంది.
దీనిని గమనించి సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ..వీఐపీలకు దర్శనంలో ప్రాధాన్యత తగ్గిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలు తొలి రెండు రోజుల్లో మంచి ఫలితాన్నిచ్చింది. సర్వదర్శనం చేసుకొనే భక్తులకు గతం కంటే భిన్నంగా తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. సర్వ దర్శనం భక్తులు ఎక్కడా వెయిటింగ్ లేకుండా క్యూ లైన్లు ముందుకు వెళ్తున్నాయి.
ఈ రోజు దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఎక్కడా నిరీక్షణ అవసరం పడలేదు. టికెట్ లేని భక్తుల దర్శనానికి గరిష్ఠంగా మూడు గంటల సమయం తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం శ్రీవారిని 64,586 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 27,501 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.9 కోట్లు ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వారాంతం అయినా.. శ్రీవారి దర్శనం వేగంగా త్వరగా జరుగుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో, శ్రీవారిని దర్శించుకునేవారి సంఖ్య పెరుగుతున్నది. అదే విధంగా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం.. ఆ వెంటనే మరుసటి రోజు నుంచి వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా పది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే ఎక్కువ సంఖ్యలో ఈ సారి శ్రీవారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొనేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. రోజుకు 25 వేల మందికి దర్శనానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.