కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- ఇకపై కొత్తగా..!!
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల తాకిడితో కంపార్ట్మెంట్లు భర్తీ అయ్యాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కనుమ నాడు నిర్వహించే పారువేట ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు.

ఘనంగా పారువేట
పారువేట ఉత్సవం సందర్భంగా మలయప్ప స్వామివారిని అర్చకులు ఊరేగించారు. క్షత్రియ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. మలయప్ప స్వామివారికి శంఖం, చక్రం, గద, బాణం, ఖడ్గం, విల్లంబులను ధరింపజేశారు. పంచ ఆయుధాలతో స్వామివారు పారువేటకు వెళ్లారు. అనంతరం పారువేట మండపం వద్ద అర్చకులు స్వామివారి తరఫున ఈటెలను సంధించడంతో ఈ ఉత్సవం ముగిసింది.

పర్యవేక్షించిన ఛైర్మన్..
దీన్ని తిలకించడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28వ తేదీన రథసప్తమి పండగను వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోన్నామని అధికారులు వివరించారు.

అన్నదానం కాంప్లెక్స్..
కాగా- శ్రీవారి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గం గుండా కాలి నడకన తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకుంటోన్నారు. వారి ఆకలిని తీర్చడానికి మినీ అన్నదాన ప్రసాదం కాంప్లెక్స్ ను నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించనున్నారు. శ్రీవారి మెట్టు అత్యంత సమీపంలో ఉండే ఎంబీసీ రోడ్డులో ఈ కొత్త అన్నదానం కాంప్లెక్స్ నిర్మితం కానుంది.

ఎంబీసీ ఏరియాలో..
ఈ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. దీనితో పాటు కాలినడకన వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఎంబీసీ ఏరియాలో అందుబాటులో భూమిని ఆయన గుర్తించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పునరావాస కేంద్రం, ప్రతిపాదిత తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం గోశాలలో జరిగిన గోపూజలో పాల్గొన్నారు.

భక్తులతో కలిసి భోజనం..
పాత అన్నదానం కాంప్లెక్స్ను సందర్శించారు. స్వామివారి భక్తులతో కలిసి ఆయన అక్కడే భోజనం చేశారు. టీటీడీ అధికారులు అందిస్తోన్న ఆహారం, ఇతర సేవల నాణ్యతపై ఆరా తీశారు. భక్తులను అడిగి తెలుసుకున్నారు. సేవల్లో ఏవైనా లోపాలు ఉంటే నిర్భయంగా అధికారులకు తెలియజేయాలని, వారి నుంచి అందే ఫీడ్ బ్యాక్ వల్ల సౌకర్యాలను మరింత మెరుగుపర్చడానికి అవకాశం ఉంటుందని అన్నారు. భక్తుల కోసం సన్షేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications