టీమిండియా ఓడిపోవాలంటూ బెజవాడ పాస్టర్ ప్రార్ధనలు? జీసస్ అనుగ్రహించాడా?(వీడియో)
విజయవాడ: భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడానికి ఓ పాస్టర్ కారణమా? మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవాలని ఆయన ఏసుప్రభువును ప్రార్థించాడా? ఆయన ప్రార్థనలు ఫలించడం వల్లే కోహ్లీసేన ఓటమి పాలైందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో సాగుతోన్న చర్చ ఇది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై రచ్చ చేస్తోంది. వైరల్గా మారింది.

అసలు కారణమేంటీ?
ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు నిర్వహించారు. క్రైస్తవమతంలో ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు గానీ, సువార్త కూటములు గానీ ఆదివారం నాడే నిర్వహిస్తుంటారు. ఆదివారం నాడు చర్చిల్లో రోజంతా ప్రార్థనలు కొనసాగుతుంటాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అదే రోజు ఫైనల్ మ్యాచ్ను నిర్వహించాల్సి ఉంది.భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్లో గెలిచి, ఫైనల్లో అడుగు పెడితే- ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ను తిలకించడానికి ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోతారనడంలో సందేహాలు అనవసరం. అలా జరిగితే- ఆదివారం నాటి క్రైస్తవ ప్రార్థనా సమావేశాలు గానీ, సువార్త కూటములపై గానీ పెను ప్రభావం పడుతుంది. అభిమానులెవరూ ఆ సమావేశాలకు హాజరు కారు. అదే- భారత క్రికెట్ జట్టు అసలు ఫైనల్కు వెళ్లలేకపోతే? సెమీ ఫైనల్లోనే ఓడిపోయి, ఇంటిదారి పడితే ఆ సమస్యే తలెత్తదు.

ప్రార్థన సమావేశాల కోసం.. భారత జట్టు ఓటమిని కోరుకున్న పాస్టర్
దీన్ని దృష్టిలో ఉంచుకుని- భారత జట్టు సెమీ ఫైనల్లో ఓడిపోవాలని తాను ఏసుప్రభువును వేడుకున్నానని, ఆయన తన మొర ఆలకించాడని ఆ పాస్టర్ చెబుతున్నారు. తమ ప్రార్థనా సమావేశాలు సరిగ్గా జులై 14వ నాడు ఏర్పాటు చేసుకున్నామని, ఆ రోజు ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఉంటుందని, భారత్ ఫైనల్కు వెళితే ఎంతమంది వస్తారో తెలియదని తన వద్ద ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లో ప్రవేశించడం వల్ల ఆదివారం నాటి తమ ప్రార్థనలకు విఘాతం కలుగుతుందని ఆందోళనను చెందారని తెలిపారు. ఆదివారం నాటి మ్యాచ్ వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యమైపోతాయని, విజయవాడలో రోడ్ల మీద స్క్రీన్లు పెట్టి ఆ మ్యాచ్ను చూపిస్తారని ఆవేదన వ్యక్తం చేయగా.. తాను ఇండియా ఫైనల్స్కు వెళ్లదని విశ్వాసంతో చెప్పానని పాస్టర్ తెలిపారు. దీనికోసం ప్రత్యేక ప్రార్థనలు చేశానని అన్నారు.

తన ప్రార్థనను ఆలకించిన జీసస్..
తన ప్రార్థనలను దేవుడు ఆలకించాడని, అందువల్లే- టీమిండియా ఫైనల్కు వెళ్లలేదని అన్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇండియా 240 పరుగుల టార్గెట్ను ఛేదించలేక ఓడిపోయిందని, ఇది అనూహ్యమని చెప్పాడు. ఏడో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న భారత జట్టు స్వల్ప లక్ష్యాన్ని అధిగమించలేకపోయిందని, దీనికి కారణం తన ప్రార్థనలేనని అన్నాడు. నేను నిజంగా ప్రార్థనలు చేశానండి..ఇండియా ఫైనల్స్కు వెళ్లకూడదు.. అని ప్రార్థించా. ఎందుకో తెలుసా? చాలామంది వంటవాళ్లు ఈ ప్రార్థనా సమావేశాలకు రామంటున్నారు. ఇండియా ఫైనల్స్కు వెళితే మ్యాచ్ చూడాలని చెప్పారు. అందుకే తాను సెమీ ఫైనల్లోనే ఇండియా ఓడిపోవాలని ప్రార్థించానని అన్నాడా పాస్టర్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
కోట్లాదిమంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయంటోన్న నెటిజన్స్
పాస్టర్ చేసిన ప్రార్థనల వల్లే టీమిండియా సెమీ ఫైనల్లో ఓడిపోయిందని అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. అదెంత వరకు నిజమో తెలియదు. టీమిండియా ఓటమిని ఆ పాస్టర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, తన ఉనికిని చాటుకోవడానికి వాడుకుంటున్నారంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. పాస్టర్ చెప్పినట్టే టీమిండియా ఓడిపోయి ఉంటే- అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆరోపిస్తున్నారు అభిమానులు. భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించాలని వంద కోట్ల మందికి పైగా భారతీయులు అకాంక్షించారని, అలాంటిది తన ప్రచారం కోసం, ప్రార్థనా సమావేశాల కోసం వారి మనోభావాలతో పాస్టర్ ఆడుకున్నట్టయిందని మండిపడుతున్నారు. ప్రపంచకప్ను సాధించడానికి క్రికెటర్లు రేయింబవళ్లు శ్రమించి ఉంటారని, కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసి ఉంటుందని, ఆ శ్రమ అంతా ఓ పాస్టర్ స్వార్థం వల్ల బూడిదలో పోసినట్టు మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications