ఇక ఆ 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులే: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతారని ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా 'సారీ'
52వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే..
52వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని సీఎం చెప్పారు. ఉద్యోగుల సంతోషం కోసం చిరునవ్వుతో ఈ కార్యక్రమం చేస్తున్నామని జగన్ తెలిపారు. కార్మికుల కోసం రూ. 3,600 కోట్ల మేర భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు.
చంద్రబాబు అలా చేశారు?
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని జగన్ అన్నారు. ప్రైవేటు రంగ సంస్థల్లోని ఉద్యోగులు.. ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చారని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 1997లో చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్మాత్మక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామని సీఎం జగన్ చెప్పారు.
ఛార్జీల పెంపుపై పేర్ని నాని
ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై రవాణా, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఆర్టీసీ దూరం అయిపోతున్నారని రామానాయుడు బాధపడుతున్నారని.. ఆయన విచారం వ్యక్తం చేసేంతగా ఏమీ జరగడం లేదని అన్నారు. రామానాయుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్ని నాని అన్నారు. ఛార్జీల పెంపుతో ప్రజలు బస్సులు ఎక్కడం మానలేదని, ఇవాళ మీరు కంగారు పడేంతగా సామాన్యుల మీద భారం పడలేదని రామానాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా.. తక్కువ ఖర్చుతోనే ప్రజలను ఆర్టీసీ వారి గమ్యస్థానాలకు చేర్చుతోందని పేర్ని నాని తెలిపారు.