ఛార్జీల మోత.. మోయలేని భారం, జగన్పై అచ్చెన్న ఫైర్
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై ఆయన భగ్గుమన్నారు. జనంపై మోయలేని భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులపై భారం మోపనని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మరీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టిక్కెట్పై రూ.10 పెంచిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని అడిగారు.
డీజిల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. మరీ ఏపీలో మాత్రం అందుకు విరుద్దంగా ఉందన్నారు. డీజిల్ ధర పెరుగుతోందని చెప్పారు. డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్పై పన్ను వెనక్కి తీసుకుని ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్కు పాలించడం చేతకాకపోతే దిగిపోవాలని సూచించారు. కానీ జనంపై ఇలా భారం మోపడం మంచిది కాదన్నారు.
24 గంటలు కరెంటు ఇవ్వని పక్షంలో ఛార్జీలు ఎలా పెంచుతారని అడిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించినప్పుడే రాష్ట్రానికి ఇబ్బందులు పోతాయని చెప్పారు. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి సొంత బ్రాండ్ల తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్యంపై రూ.12 వేల కోట్లు దోచుకున్నారని ఆయన ప్రశ్నించారు. కరెంటు రేట్లు విపరీతంగా పెంచారని మండిపడ్డారు.
దేశ చరిత్రలో ఇన్ని దొంగ పన్నులు ఎప్పుడూ చూడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. న్యాయ వ్యవస్ధను కూడా విమర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు నేరస్తులుగా ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాలను తెచ్చి కాల్చారంటే పరిస్థితి దారుణం ఉందన్నారు. మరీ రాష్ట్రంలో దేనికి రక్షణ ఉందని అడిగారు. దోచుకోవడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారా అని అచ్చెన్నాయుడు నిలదీశారు.