పోరాటం చెయ్యండి .. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించండి.. వంశీ లేఖకు చంద్రబాబు రిప్లై..
గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎమ్మెల్యే పదవికి, టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఆ లేఖలో తనపై, తన అనుచరులపై వేధింపులు తట్టుకోలేక రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. అయితే వల్లభనేని వంశీ తీసుకొన్ననిర్ణయం సరైనది కాదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీ కి లేఖ రాశారు.

టీడీపీలో వంశీ పనితీరును ప్రశంసించిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఆ లేఖలో చంద్రబాబు వల్లభనేని వంశీ టీడీపీ తో పాటుగా,గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా సమర్ధవంతంగా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక వంశీ రాసిన లేఖలో వైసిపి నేతలు, ప్రభుత్వ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని పేర్కొన్నారు.ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు సైతం అంగీకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలకు పాల్పడుతోందని తన అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారు. అంతేకాదు అన్యాయంపై పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరిదీ అని చంద్రబాబు పేర్కొన్నారు.

రాజకీయాల నుండి వైదొలగినా వేధింపులు ఆగవు అన్న చంద్రబాబు
రాజకీయాలనుండి వైదొలిగినంత మాత్రాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి వేధింపులు ఆగవని అభిప్రాయపడ్డారు చంద్రబాబు . ప్రస్తుత ప్రభుత్వ వేధింపులను పార్టీ పరంగా ఎదుర్కొందామని, వ్యక్తిగతంగానూ తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీపై కొనసాగిస్తున్న వేధింపులను, పెడుతున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకు వెళ్దామని, అంతేకానీ ఇలా రాజీనామా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని చంద్రబాబు నాయుడు వంశీకి సూచించారు.

రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని సూచన
మరోమారు వంశీ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని చంద్రబాబు తన లేఖ ద్వారా వంశీని కోరారు. ఎప్పుడు అన్యాయం జరిగినా తలచుకోకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఇక అంతే కాదు ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై అవసరం అనుకుంటే గవర్నర్ ,రాష్ట్రపతి తదితరుల దృష్టికి తీసుకు వెళ్దామని చంద్రబాబు పేర్కొన్నారు.

తన నిర్ణయానికే కట్టుబడిన వంశీ ... స్పీకర్ అంగీకరిస్తారా.. ?
రాజకీయాలనుండి వైదొలగడం, రాజకీయ సన్యాసం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని, అది సమస్యకు పరిష్కారం కాదని చంద్రబాబు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరోమారు పునరాలోచించాలని లేఖ రాశారు. చంద్రబాబు ఇంతగా లేఖ రాసి పునరాలోచించాలని సూచించినా వల్లభనేని వంశీ తన నిర్ణయం మార్చుకునే ఆలోచనలో లేరని తాజా రాజకీయ పరిణామాల ద్వారా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యేగా వంశీ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ అంగీకరిస్తే, సభలో టిడిపి బలం 23 నుంచి 22 కి పడిపోతుంది.












Click it and Unblock the Notifications