వైజాగ్లో ల్యాండ్ మాఫియా: గంటా, ధర్మాన కుమారులపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు
రాజధాని మార్పు ఊహాగానాలతో అమరావతి సహా ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అలజడి నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నాయని, రాజధానినే మార్చే ప్రక్రియ చేపట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సూచించారు. లేదంటే జనాగ్రహానికి గురికాక తప్పదని సీఎం జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించారు.
రాజధాని మారిస్తే అక్కడే జగన్ పతనం ఆరంభం : సీపీఐ రామకృష్ణ
ప్రభుత్వాలే శాశ్వతం
రాష్ట్రాలు, కేంద్రంలో రాజకీయ పార్టీల అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్ గుర్తుంచుకోవాలని నారాయణ సూచించారు. రాజకీయ పార్టీల అధికారం మారుతూ ఉంటుందని, ప్రభుత్వాలే శాశ్వతం అని చెప్పారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధానిని మార్చడం సరికాదని నారాయణ అన్నారు. దీంతో జనాలకు ప్రభుత్వంపై విశ్వాసం పోతుందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై నమ్మకం ఉండదని చెప్పారు.
అమరావతిలోనే..
అమరావతిలోని రాజధానిని కొనసాగించాలని సీపీఐ పార్టీ తరపున నారాయణ డిమాండ్ చేశారు. ఏపీలోని 13 జిల్లాల ప్రజలకు సెంటర్ పాయింట్ అని వివరించారు. విశాఖపట్టణాన్ని రాజధాని చేస్తే.. రాయలసీమ వాసులు వెయ్యి కిలోమీటర్లు దాటి రావాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ప్రజల సౌకర్యం కోసం రాజధాని ఉండాలే తప్ప.. కక్షసాధించేందుకు రాజధాని మార్చాలనుకోవడం సరికాదన్నారు.
మరో 30 ఏళ్లు..
రాజకీయంగా చిన్న వయస్సులోనే జగన్ సీఎం అయ్యారని, మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలని అనుకొంటున్నారని నారాయణ గుర్తుచేశారు. ఈ క్రమంలో రాజధాని మార్పు సరికాదని సూచించారు. ఏటికి ఎదురీవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని గుర్తుచేశారు. గత అసెంబ్లీ సమావేశంలో జగన్ ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేయాలని కోరారు. కాదు కూడదని అసెంబ్లీలో బలం ఉందని, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మూర్ఖంగా ముందుకెళ్లొద్దని సూచించారు. ఎమ్మెల్యేలు గ్రిప్లో ఉంటారే తప్ప.. ప్రజలు ఉండరని చెప్పారు. సమయం చూసి బుద్ది చెబుతారని సూచించారు.
కులం, మతం ఉండవు
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణం మారబోతుందన్న క్రమంలోనే రియల్ భూం వచ్చిందని కుండబద్దలు కొట్టారు. భూ మాఫియకు జాతి, కులం, మతం ఉండవని, వారంతా ఒక్కటేనని చెప్పారు. టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు కుమారుడు కూడా భూకబ్జా దందాలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన విపక్ష టీడీపీకి చెందినవారు కదా అని ప్రశ్నించారు. భూ మాఫియా, కబ్జాకోరుల కులం ఒక్కటేనని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు కుమారులు కూడా భూ మాఫియాలో ఉన్నారని గుర్తుచేశారు. వైసీపీ నేత తిప్ప నాగిరెడ్డి కూడా భూ మాఫియా చేస్తున్నారని తెలిపారు.
బయటపడని పేర్లు..
రాజధానిపై వేసిన కమిటీలో వీరందరీ పేర్లు వచ్చాయని, అందుకే కమిటీ పేర్లను బహిర్గతం చేయలేదని నారాయణ గుర్తుచేశారు. రాజధానిని మాత్రం అమరావతిలోనే కొనసాగించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో కూడా బెజవాడలో రాజధాని పెట్టాలని కోరితే.. ఇక్కడ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని కర్నూలు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తర్వాత హైదరాబాద్కు మారిందని చెప్పారు. ఏపీ విభజన సమయంలో కూడా బెజవాడ రాజధాని ఏర్పాటు చేయాలని సీపీఐ కోరుకుందని చెప్పారు.