ఏపీలో రోడ్డెక్కిన దిశ వెహికల్స్: వాటి స్పెషాలిటీ ఇదే: బైక్స్ మాత్రమే కావవి
విజయవాడ: రాష్ట్రంలో మహిళలపై కొనసాగుతోన్న దాడులు, ఆకృత్యాలను నివారించడానికి జగన్ సర్కార్ రూపొందించిన దిశ చట్టంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. దిశ- మహిళా పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ 900 ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
వైఎస్ జగన్ సంచలనం: సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు కుదరవిక: కట్టడిపై
స్పెషాలిటీలివే..
ఇదివరకు 108, 104 అంబులెన్సులు.. మొన్నామధ్య రేషన్ డెలివరి వాహనాలు..అదే తరహాలో దిశ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించేలా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఈ బైక్స్లో అమర్చారు. ప్రతి బైక్కు జియో ట్యాగింగ్ వ్యవస్థ ఉంటుంది. దిశ యాప్తో వాటిని అనుసంధానించారు. ఫోన్ కాల్ లేదా యాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే.. అందులో పొందుపరిచిన సంఘటనా స్థలానికి ఎంత సేపట్లో చేరుకుంటారనే సమాచారం కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.
దిశ యాప్ యూజర్లకు తక్షణ సమాచారం..
అలాగే- దిశ బైక్.. సంఘటనా స్థలానికి ఎంత దూరంలో ఉందనే విషయాన్ని కూడా ట్రాక్ చేయడానికి వీలుంది. ఇప్పటిదాకా దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న 12.60 లక్షల మందికి పైగా తక్షణ సమాచారాన్ని చేరవేయడానికి పోలీసులు రూపొందించిన పుష్ బటన్ ఆప్షన్ సౌకర్యంలో.. ఈ వాహనాల వివరాలు తెలిసేలా ఏర్పాటు చేశారు. పుష్ బటన్ ద్వారా యూజర్లకు తెలియజేయాలనుకున్న సమాచారం ఇకపై దిశ వాహనాలను వినియోగించే పోలీసులకు కూడా అందేలా ఈ వ్యవస్థను రూపొందించిన్నట్లు చెబుతున్నారు.
పుష్ బటన్తో బైక్స్ వివరాలు అనుసంధానం..
దిశ యూజర్లకు పోలీసులు ఏదైనా సమాచారాన్ని పంపించాలనుకుంటే.. ఈ పుష్ బటన్ ఆప్షన్ను వినియోగిస్తారు. దీనితో వారు చెప్పదలచుకున్న సమాచారం ఏక కాలంలో యూజర్లందరికీ చేరుతుంది. ఇదే సౌకర్యాన్ని దిశ బైక్స్కు కూడా అందేలా ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణ మొత్తం పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలో ఉంటుంది. అక్కడి నుంచి దిశ బైక్స్కు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తారు.
కేక్ కట్..
వాహనాలను ప్రారంభించడానికి ముందు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. మంత్రులు మేకతోటి సుచరిత (హోం), తానేటి వనిత (మహిళా, శిశు సంక్షేమం), మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. దిశ బైక్స్ వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు.