పార్టీ మార్పుపై కేశినేని నానీ ..జగన్ ను కూడా కలుస్తానన్న టీడీపీ ఎంపీ
టీడీపీలో గత కొంత కాలంగా పార్టీ మారతారని ప్రచారం జరిగిన నేత కేశినేని నానీ పార్టీ మారలేదు కానీ అనూహ్యంగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అటు టీడీపీకి, చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. బిజెపిలో చేరిన వారినుద్దేశించి లోకసభ సభ్యులు ముగ్గురు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కేశినేని నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను బిజెపిలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను కేశినేని నానీ ఖండించారు .

కేంద్ర మంత్రుల్ని కలవటంలో ఎలాంటి రహస్యం లేదన్న నానీ .. పార్టీ మారాల్సిన అవసరం లేదన్న ఎంపీ
ఇక పార్టీ మార్పుపై ఆయన మాట్లాడుతూ తాను కేంద్ర మంత్రుల్ని కలవటంలో ఎలాంటి రహస్యం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని కేశినేని నాని స్పష్టంచేశారు. ప్రధాని మోడీని కలవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఒక ఎంపీగా తాను ఎవరినైనా కలుస్తానని, అవసరం అనుకుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా కలుస్తానని సమాధామిచ్చారు. మోడీ ప్రధాని కాబట్టి కలిశానని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కలుస్తానని, ఇక ఎవర్ని కలిసినా పార్టీ మారుతానని అనుకోవద్దని ఆయన అన్నారు. ఒక ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరం అనుకుంటే భవిష్యత్ లో కూడా అందర్నీ కలుస్తానని దానికి మీడియా పెడార్ధాలు తీయటం మానుకోవాలని ఆయన అన్నారు.

అవసరం అయితే జగన్ దగ్గరకు వెళ్తా అన్న నానీ
రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏపీ సీఎం జగన్ వద్దకు,మోడీ ప్రధాని వద్దకు ఇంకా అవసరం అయితే మంత్రుల వద్దకైనా వెళ్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వదని నాని అన్నారు. జగన్ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించినా, పొరలు దండాలు పెట్టినా బీజేపీ హయాంలో ప్రత్యేక హోదా రాదనీ కేశినేని నానీ పేర్కొన్నారు. తాము ప్రత్యేక హోదా కోసం అడిగి అడిగి విసిగిపోయామని ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని నానీ అన్నారు . బీజేపీ ఇవ్వదని తేల్చి చెప్పారు.

జగన్ పొరలు దండాలు పెట్టినా ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పిన కేశినేని నానీ
ఇక జగన్ ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినందునే ఆయనను ప్రజలు నమ్మినట్లు అభిప్రాయపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నానీ . రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా కోసం తాము అన్నివిధాలా పోరాటం చేసి విఫలమయ్యామని చెప్పిన ఆయన జగన్ పొర్లుదండాలు పెట్టి.. తలకిందులుగా తపస్సు చేసినా బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం అసంభవం అని నాని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications