'లోకేష్ సీఎం పదవి కోసం చంద్రబాబు ప్రయత్నాలు అవసరం లేదు, మోడీకి నేనొక్కడిని చాలు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని విజయవాడ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని గురువారం అన్నారు. ఆయన నూటికి నూరు శాతం అందుకు అర్హులు అని చెప్పారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రయత్నాలు అవసరం లేదు
నారా లోకేష్ పైన ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు సరికాదని కేశినేని నాని అన్నారు. లోకేష్ కోసం చంద్రబాబు ఏపీకి నష్టం చేస్తున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఇది సరికాదని కేశినేని నాని అన్నారు. ప్రధాని హుందాతనాన్ని దిగజార్చి మాట్లాడారన్నారు. ప్రపంచ దేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబును, రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేస్తున్న లోకేష్ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారన్నారు. లోకేష్ను సీఎంగా చేసేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
బాలకృష్ణ ఎన్ని తీసినా అది సగమే, లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట బాధ కలిగించింది: లక్ష్మీపార్వతి
సీఎంగా చేయగల సత్తా ఉంది
రాష్ట్రానికి సీఎంగా చేయగల సత్తా లోకేష్కు ఉందని కేశినేని అన్నారు. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో, అటు పట్టణస్థాయిలో మౌలికవసతులు కల్పిస్తూ, అటు రాష్ట్రానికి పలు ఐటీ కంపెనీలను తీసుకు వస్తున్న లోకేష్ సీఎం పదవికి అన్ని విధాలా అర్హులు అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్పై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసల జల్లు కురిపించారన్నారు.
ప్రజాప్రతినిధులను ప్రజలముందుకు తెచ్చిన ఘనత చంద్రబాబుదే
నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉండాలని కేశినేని చెప్పారు. గ్రామాలలో ఏవైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. జన్మభూమి ద్వారా ప్రజాప్రతినిధులను ప్రజల ముందుకు తీసుకు వచ్చి నిలిపిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
మోడీకి నేనొక్కడినే సరిపోతా
నవ్యాంధ్ర ప్రదేశ్లో కరెంట్ కోతలు లేకుండా చేశామని కేశినేని నాని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన మాటలను ఇక సహించేది లేదని తేల్చి చెప్పారు. మోడీకి సమాధానం చెప్పేందుకు నేను ఒక్కడినే సరిపోతానని చెప్పారు.