ప్రాజెక్ట్ లపై టీడీపీ చెప్పినవి నిరూపిస్తే మీసం తీసేసి తిరుగుతా : దేవినేని ఉమాకు మంత్రి అనీల్ సవాల్
తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద జల వివాదం మొదలైంది. అయితే కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై టీడీపీ తమ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపధ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.

పోలవరం నిర్మాణంపై టీడీపీ చెప్పింది అబద్ధం .. నిరూపించాలన్న మంత్రి
పోలవరం 70 శాతం పూర్తి చేశామని టీడీపీ చెప్పింది అంతా అబద్ధమని , 70 శాతం పూర్తయింది నిరూపిస్తే మీసం తీసేసి తిరుగుతా అని మాజీ మంత్రి దేవినేని ఉమాకు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చాలెంజ్ చేశారు . ఒకవేళ నిరూపించలేకపోతే ఉమా మీసం తీసి తిరుగుతారా అని ఆయన ప్రశ్నించారు . వెలిగొండ ప్రాజెక్టు టీడీపీ హయాంలో పూర్తైందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మంత్రి అనిల్ దుయ్యబట్టారు. వైఎస్ కట్టిన పట్టిసీమను తామే కట్టామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదని , రాయలసీమకు నష్టం చేసింది టీడీపీ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు .

పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో లెక్క తేలుద్దామా అని ప్రశ్న
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనీల్ గతంలో ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాలు విసిరారు. దేవినేని ఉమా అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. అసలు టీడీపీ హయాంలో అవినీతి తప్ప చేసిందేమీ లేదన్నారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని తొలుత పెంచింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామన్న మంత్రి అనీల్
టీడీపీ పోతిరెడ్డిపాడు విషయంలో ఏం చెయ్యలేదని చెప్పారు . కృష్ణా నది వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. చరిత్రలో మొదటిసారిగా వైయస్ జగన్ నేతృత్వంలో సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదని , ప్రస్తుత జగన్ సర్కార్ చెప్పింది చేసి చూపించే సత్తా ఉన్న సర్కార్ అని ఆయన చెప్పుకొచ్చారు . సీఎం జగన్ సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో పెడుతున్న దృష్టి అందుకు కారణం అని ఆయన పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications