మంత్రి కొడాలి నానీ నోటిదురద ఎఫెక్ట్ ... తలనొప్పిగా మారిన రెండు వివాదాలు
ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడిపై,టిడిపి నాయకులపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ ఇతర టీడీపీ నాయకులపై విరుచుకు పడిన నాని కొద్ది రోజులుగా తన నోటికి పనిచెబుతున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ నోటికి ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ నోరే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. కొడాలి నాని తన నోటి దురద కారణంగా రెండు వివాదాల్లో చిక్కుకున్నారు. లేని తలనొప్పులు తెచ్చుకున్నారు.

కొడాలి నానీ తిరుమల వ్యాఖ్యలపై ఫిర్యాదులు
మొన్నటికి మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, అలాగే లోకేష్ మరియు ఇతర టిడిపి నాయకుల పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ నాని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక నాని వ్యాఖ్యలను హిందూ సంఘాలు, బిజెపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి ఏకంగా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది అంటే నాని చేసిన వ్యాఖ్యల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సీఎం జగన్ ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదన్న నానీ
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలయ ప్రవేశానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు తిరుమల ఆలయాన్ని ఎవడి అమ్మ మొగుడు నిర్మించాడు అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై అటు టిడిపి నేతలు, ఇటు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అన్య మతస్థులు ఎవరు వెళ్లాలన్నా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని భాను ప్రకాష్ పేర్కొన్నారు.

తిరుమల నియమావళిని ఎవరూ అతిక్రమించకూడదని హిందూ సంఘాల ఆగ్రహం
ఆలయానికి సంబంధించిన వ్యవహారం పై మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయని బిజెపి నేతలు మండిపడుతున్నారు. అటు బీజేపీ తో పాటుగా, హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు సైతం నాని ఆ విధంగా వ్యాఖ్యానించడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తిరుమల నియమావళిని ఎవరు అతిక్రమించడానికి వీలు లేదని, భక్తుల విశ్వాసాలపై, సాంప్రదాయాలపై నిజంగా మాట్లాడే వారిని ఉపేక్షించ కూడదంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి .

ఎవరైనా అన్య మతస్తులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాల్సిందే అంటున్న హిందూ, బ్రాహ్మణ సంఘాలు
ఇక అంతే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న దేవస్థానం, అది ప్రభుత్వ అధీనంలోని నడిచే దేవస్థానం కాదని గుర్తు చేస్తున్నారు. ఇతర మతస్థులు అయిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ వరకు ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడానికి వెళతారని కొడాలి నానికి గుర్తుచేస్తున్నారు హిందూ సంఘాల నాయకులు.ఇక బిజెపి నాయకులు అయితే మంత్రి కొడాలి నానిని సీఎం జగన్మోహన్ రెడ్డి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రిని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్
ఓ మంత్రి హోదాలో ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సమంజసం కాదని వారంటున్నారు. ఇతర మతాల గౌరవాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి సాక్షాత్తూ మంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి నాయకులు. ఇక ఈ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. తిరుమల ఆలయం లోకి ప్రవేశించాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్న మంత్రివర్యులు కొడాలి నాని, హిందూ సంఘాలు, బిజెపి నాయకులు, బ్రాహ్మణ సంఘాలు ఇంతగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

యనమల రామకృష్ణుడు బ్రోకర్ అంటూ చెలరేగిన మంత్రి కొడాలి నానీ
ఇక మరోవైపు చంద్రబాబు, లోకేష్ లపై నోరు పారేసుకున్న కొడాలి నాని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బ్రోకర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక దీని పై జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజులలోగా కొడాలి నాని యనమల రామకృష్ణుడు కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఇక అంతే కాకుండా కొడాలి నాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా హెచ్చరిస్తుంది జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్.
Recommended Video

బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ..
మంత్రి కొడాలి నాని తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో వైసీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. మొత్తానికి కొడాలి నాని నోటి దురద ఆయనకు ఇప్పుడు తిప్పలు పెట్టింది .కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. మరి ఈ వ్యవహారంపై కొడాలి నాని స్పందిస్తారా? లేకుంటే ఇది ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications