జగన్ రెడ్డి! మేం బరితెగిస్తే..తండ్రి కాలం నుంచి మీ దృష్టి దానిపైనేగా..: జనసేన శతాఘ్ని ఫైర్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన విషయం తెలిసిందే. నాడు పాదయాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ భార్యలను కార్లను మారుస్తున్నట్లుగా మారుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్.. నేడు సీఎం హోదాలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.

జగన్ విమర్శలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంను ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతోత్సవాల్లో భాగంగా జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.

పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు
పవన్ కళ్యాణ్కు ముగ్గురు భార్యలు... వారికి నలుగురో.. ఐదుగురో పిల్లలు.. వారంతా ఎక్కడ చదువుతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వారు మాత్రం ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదవాలి గానీ.. పేదలకు మాత్రం ఇంగ్లీషు మీడియం చదువులు వద్దా? అని జగన్ నిలదీశారు. అలాగే, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వారి పిల్లలను, వెంకయ్యనాయుడు వారి పిల్లలను, మనవళ్లను, మనవరాళ్లను తెలుగు మీడియంలోనే చదివిస్తున్నారా? అని ప్రశ్నించారు జగన్.
పవన్ కళ్యాణ్ కౌంటర్
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగు మీడియా కావాలని డిమాండ్ చేసిందని.. అధికారంలోకి రావడంతోనే మాట మార్చి ఇంగ్లీషు మీడియం అంటోందని విమర్శించారు.

మీ తండ్రి కాలం నుంచి దానిపైనేగా..
‘మీ నాన్న గారి కాలంలో తమరు దోపిడీల మీద కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన మీద దృష్టి ఉంటే పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారు వైఎస్ జగన్.. కానీ ఏం చేస్తాం కనీసం తెలుగు కూడా సరైన బోధన లేని స్థితికి నాయకులందరూ దిగజార్చారు' అని జనసేన శతాఘ్ని టీం తీవ్ర వ్యాఖ్యలుచేసింది.
చిప్పకూడు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్లేనా?
‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల అంట నిజమా వైఎస్ జగన్?' అంటూ జనసేన శతాఘ్ని టీం నిప్పులు చెరిగింది.

మీలా బరితెగించి.. మీ ఇంటివాళ్ల మీదకొస్తే..
‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్థ వైఎస్ జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?' అంటూ జనసేన శతాఘ్ని టీం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సంయమనం పాటించాలని జనసైనికులకు..
సీఎం జగన్ తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలపై తమ పార్టీ నాయకులు గానీ, జనసైనికులు గానీ స్పందించవద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం చేస్తున్న తమ పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేసినా ప్రజా క్షేమం కోసం భరిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం విజయవాడలో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అప్పుడే పవన్ కళ్యాణ్ అన్నింటికీ సమాధానం చెబుతారని అన్నారు.
ఇది మా సంస్కారం అంటూ..
తాను కూడా వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డిలా విమర్శలు చేయగలనని.. కానీ, వారి ఇంట్లో ఉన్న తల్లులు, ఆడపడుచులు గుర్తుకు వస్తారని.. అందుకే తాను అలాంటి వ్యాఖ్యలు చేయనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications