విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య: తల్లిదండ్రులకు ఫోన్లు, వచ్చేలోగానే..
అమరావతి: కృష్ణా జిల్లాలోని శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్న అనంతపురానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం నుంచి విజయవాడకు..
వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరానికి చెందిన లాస్యశ్రీ అనే విద్యార్థిని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైసీపీ మొదటి సంవత్సరంలో చేరింది. డాక్టర్ కావాలనే ఉద్దేశంతో లాస్య బైపీసీలో చేరింది. అయితే, స్థానికంగా ఫ్యాకల్లటీ సరిగా లేకపోవడంతో ఆమె కృష్ణా జిల్లాలోని కంకిపాడు పోరంకి బ్రాంచీ శ్రీచైతన్యలో చేరింది.
ఇంటికి తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులకు ఫోన్లు
ఈ క్రమంలో గత ఐదు రోజులుగా కరోనా కారణంగా విద్యార్థులు కాలేజీ నుంచి వెళ్లిపోతున్నారని.. తాను కూడా ఇంటికి వస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో వచ్చే ఆదివారం వచ్చి తీసుకెళ్తానని లాస్య తండ్రి ఆమెకు తెలిపారు. ఇంతలోనే లాస్య ఆరోగ్యం సరిగా లేదని, సీరియస్గా ఉందంటూ తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. ఆందోళనకు గురైన లాస్య తల్లిదండ్రులు వెంటనే విజయవాడకు చేరుకున్నారు. అయితే, అప్పటికే లాస్య మృతి చెందింది. లాస్య కాలేజీ హాస్టల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. పోస్టుమార్టం అనంతరం లాస్య మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
అంతా సర్దుకుంటుందనుకుంటే.. తల్లిదండ్రులకు తీరని శోకం
కాగా, ఆత్మహత్యకు ముందు లాస్యశ్రీ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటిపై బెంగ వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. జనవరి 3న అనంతపురం నుంచి విజయవాడ శ్రీచైతన్య కాలేజీకి వచ్చిన లాస్యశ్రీ.. ఇక్కడి క్యాంపస్ వాతావరణం నచ్చడం లేదని పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే కొన్ని రోజులుంటే అంతా సర్దుకుంటుందని తల్లిదండ్రులు భావించారు. అదే ఆమెకు చెప్పారు. అయితే, ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన లాస్యశ్రీ మార్చి 10న సాయంత్రం 6 గంటలకు హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లిదండ్రులు తన గురించి సరిగా పట్టించుకోవట్లేదని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలిసింది. తాను ఫోన్ చేసినా పలుమార్లు లిఫ్ట్ చేయడం లేదని, ఈ క్రమంలోనే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది. విద్యార్థి మృతిపై కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం లోతుగా విచారించాలని ఆదేశించింది.