‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే పదం.. దాని స్క్రిప్టు ఎలా పుట్టిందంటే.. వైసీపీకి బోండా ఉమ వార్నింగ్
రాజధానిలో 4వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ సర్కారు చేస్తోన్న ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటరిచ్చింది. బుధవారం తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 'ఇన్ సైడర్ ట్రేడింగ్' వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చిన కొద్దిసేపటికే టీడీపీ నేత, విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా ముందుకొచ్చి వైసీపీ ఆరోపణల్ని ఖండించారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్న పదం ఎలా పుట్టించారో ఆయన వివరించారు.
ప్రతి ఎకరాకు ఆధారం చూపెడతాం..
వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ లాంటిదేదీ నిజంగా జరగలేదని, రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలకు ఎక్కడెక్కడ, ఎన్నెన్ని భూములున్నాయో ఆధారాలతో సహా చూపెడతామని బోండా ఉమ అన్నారు. వేమూరి రవిని లోకేశ్ బినామీగా పేర్కొనడం దారుణమని, బాలక్రిష్ణ వియ్యంకుడికి 2013లో ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కలిపారని, టీడీపీపైన, గత ప్రభుత్వంపైన బురద చల్లడమే పనిగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
హెరిటేజ్.. సండూర్ పవర్ లాంటిదికాదు..
చంద్రబాబు, బాలక్రిష్ణ బంధువులతోపాటు అప్పటి ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర తదితరులపై వైసీపీ నేతలు పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని బోండా మండిపడ్డారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన హెరిటేజ్ సంస్థపైనా అడ్డగోలు కామెట్లు చేశారని, భూముల కొనుగోలుకు సంబంధించి ఆ కంపెనీ మినిట్స్ లో పక్కాగా రాసుందని, అదేమీ జగన్ కు చెందిన సండూర్ పవర్ లాగా బినామీ కంపెనీ కాదని ఉమ చెప్పారు.
‘క్విడ్ ప్రోకో’కు పోటీగా పుట్టిందే ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’
ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా టీడీపీ సిద్ధంగా ఉందన్న బోండా ఉమ.. దమ్ముంటే చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాలు విసిరారు. ‘‘నన్ను వైసీపీ ఆఫీసుకు రమ్మంటారా.. డాక్యుమెంట్లతోసహా వస్తా.. నిజమేంటో ఇవాళే తేలిపోవాలి.. మీరు చెబుతోన్న 4వేల ఎకరాలపై మేం ఆధారాలిస్తాం. సవాలుకు సిద్ధమా?''అని ప్రశ్నించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేసి రంకు కట్టడం వైసీపీకి అలవాటైపోయిందని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అప్పట్లో వైఎస్ జగన్ క్విడ్ ప్రోకో కు పాల్పడినట్లు సీబీఐ గుర్తించిందని, కాబట్టే 43 వేల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసిందని టీడీపీ నేత ఉమ గుర్తుచేశారు. క్విడ్ ప్రోకో అనే పదానికి పోటీగా ఏదోఒకటి క్రియేట్ చేయాలనే ‘ఇన్ సైడర్ ట్రేడింగ్'ను పుట్టించారని, దీనకి స్క్రిప్టు రాసిందెవరో, దానికి సహకరించిన అధికారులెవరో అర్థంకావట్లేదని ఉమ అన్నారు.