వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధి ఖరారు..!?
గన్నవరంలో వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్ధిని పార్టీ నాయకత్వం ఖరారు చేసింది.
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార వైసీపీ తిరిగి అధికారం పై ధీమాతో ఉంది. ప్రతిపక్ష టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా కీలక నియోజకవర్గాలపైన ఫోకస్ చేసింది. 2019 ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపుతో పాటుగా వైసీపీలోకి కొందరు నేతలను ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉంది. అందులో గన్నవరం ఒకటి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. అనేక తర్జన భర్జనత తరువాత టీడీపీ గన్నవరం అభ్యర్ధి పైన తుది నిర్ణయానికి వచ్చింది.

వంశీపై టీడీడీపీ టార్గెట్..
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. కొంత కాలానికే వైసీపీకి దగ్గరయ్యారు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి టీడీపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వంశీ రాకతో వైసీపీలోని స్థానిక నేతలు విభేదిస్తున్నారు. వంశీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వటానికి సిద్దంగా లేమని చెబుతున్నారు. కానీ, వైసీపీ అధినాయకత్వం మాత్రం వంశీ వచ్చే ఎన్నిక ల్లో గన్నవరం పార్టీ అభ్యర్ధిగా ఖరారు చేసింది. ఇప్పటికే వంశీ వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తనకు నియోజకవర్గంలో ఉన్న పట్టును పెంచుకుంటూ..మరోసారి గెలిచేందుకు ప్రయత్నా లు ప్రారంభించారు. ఇదే సమయంలో గన్నవరంలో ఎలాగైనా ఈ సారి వంశీని ఓడించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ, అక్కడ టీడీపీని నడిపించే బలమైన నేత కోసం ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం అన్వేషించింది. ఇక..నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీ అభ్యర్దిగా దేవినేని చంద్రశేఖర్..!
గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ గా పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించింది. ఆయన గుండెపోటుతో రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు. గన్నవరంలో తాజాగా పార్టీ కార్యాలయం పై దాడి..ఘర్షణల తరువాత అక్కడ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సమన్వయకర్తగా కొత్త టీంను చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అభ్యర్ధిని త్వరగా ఖరారు చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా..తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. లోకేశ్కు సన్నిహితుడు కావటంతో..ఆయన పేరుకు మద్దతు లభించిందని సమాచారం. ముందుగానే అక్కడ అభ్యర్ధిని ఖరారు చేయటం ద్వారా పార్టీని నడిపించటంతో పాటుగా ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తారని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో..వంశీ పైన టీడీపీ అభ్యర్ధిగా దేవినేని చందు పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

కొడాలి నాని - వల్లభనేని వంశీ పైనే గురి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సారి ఎలాగైనా గుడివాడలో కొడాలి నాని.. గన్నవరం లో వల్లభనేని వంశీ పై టీడీడీ గురి పెట్టింది. గుడివాడలో ఇప్పటి వరకు పార్టీకి నానితో ఢీ కొట్టే సరైన అభ్యర్ధి ఖరారు కాలేదు. స్థానికంగా పలువురు నేతలు రేసులో నిలిచారు. రావి వేంకటేశ్వర రావు.. ఎన్నారై రాము పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు అభ్యర్ధి ఎవరనేది పార్టీ ఖరారు చేయలేదు. అదే సమయంలో గన్నవరం నుంచి పలువురు పేర్లు టీడీపీ నుంచి ప్రచారంలోకి వచ్చాయి. ప్రస్తుత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. టీడీపీ -జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ..కొన్ని సీట్లలో అభ్యర్దుల ఎంపిక ఎన్నికల సమయంలనే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, గన్నవరం అభ్యర్ధిని ప్రకటించేందుకు టీడీపీ నాయకత్వం సిద్దమైనట్లు సమాచారం. గుడివాడ విషయం లో జనసేనతో పొత్తు..సీట్ల సర్దుబాటులోనే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications