ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్: జగన్ ప్రభుత్వం నుంచే ఆ పని మొదలు పెడతాం
విజయవాడ: హిమాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవ్వాళ విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని సందర్శించారు. కనక దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు గంట పాటు ఆయన అక్కడే గడిపారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కనకదుర్గమ్మ గుడికి కేంద్రమంత్రి
ఈ ఉదయం అనురాగ్ ఠాకూర్ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్, ఇతర నాయకులు ఉన్నారు. ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రికి కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పాలక మండలి ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అమ్మవారి సన్నిధిలో
అనంతరం అనురాగ్ ఠాకూర్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం- ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ఆలయం బయటికి వచ్చిన కేంద్రమంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి వివరించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోన్నామని చెప్పారు.
గుడ్ గవర్నెన్స్..
ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటోన్నారని, గుడ్ గవర్నెన్స్ పట్ల మొగ్గు చూపుతున్నారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన విధానం పట్ల ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వమే కావాలని ఏపీ ప్రజలు భావిస్తోన్నారని, వారి కోరిక నెరవేరుతుందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలంటే బీజేపీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

డబుల్ ఇంజిన్..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, రోడ్లు-ఇతర మౌలిక సదుపాయాలు శరవేగంగా అందడానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోందనే విశ్వాసం తనకు ఉందని అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఏపీ నుంచే మొదలు పెడతామని స్పష్టం చేశారు.

పథకాలకు స్టిక్కర్లు..
జగన్ ప్రభుత్వం తమ పథకాలకు స్టిక్కర్లు మార్చుతోందంటూ సోము వీర్రాజు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని, ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల నిర్మాణ పనులను వేగవంతం చేసిందని చెప్పారు. వాటన్నింటినీ ప్రజలు గమనిస్తోన్నారని, వారి వైఖరిలో మార్పు వస్తోందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications