డైలమాలో వల్లభనేని వంశీ ... వైసీపీలో చేరికపై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్
వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అందరూ భావించారు. కానీ వల్లభనేని వంశీ ఇంకా డైలమాలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వైసీపీలో చేరే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని చివరకు మంచి రోజు కాదని చేరికను విరమించుకున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. అయితే వైసీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదా? వంశీ ఇంకా సందిగ్ధంలో ఉండటానికి గల కారణాలు ఏంటి ? ఆయన చేరిక ఉందా లేదా ?అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

అధికారికంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యని వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం ఎమ్మెల్యేగా, టీడీపీ సభ్యునిగా రాజీనామా చేశారు. కానీ అది వాట్స్ యాప్ రాజీనామా మాత్రమే . అధికారికంగా ఆయన తన రాజీనామాను పంపించలేదు. ఇప్పటి వరకు ఆయన తన అధికారిక రాజీనామాపై స్పందించనూ లేదు . దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారో అన్న అనుమానం సైతం తలెత్తుతుంది . వంశీ అనుచరులు వైసీపీ లో చేరతారని చెప్తున్నా ఇప్పటి వరకు వంశీ అధికారికంగా రాజీనామా చెయ్యకపోవటంతో ఆయన చేరికపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ వంశీ చేరికకు బ్రేక్ వేసిందా ? వంశీనే డైలమాలో ఉన్నారా
ఏదో బలవంతంగా రాజీనామా చేసినట్లుగా ఆయన రాసిన లేఖల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పెద్ద చర్చ జరిగింది .అసలు వంశీని పార్టీలోకి తీసుకోవడం అవసరమా అన్న అభిప్రాయాన్ని చాలామంది నేతలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అంతే కాదు వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వైసీపీ అభిమానవర్గాలే పెద్దగా ఆసక్తితో లేవు.ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వంశీ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా ? లేకా వంశీ వైసీపీలో తనపట్ల ఉన్న వ్యతిరేఖత నేపధ్యంలో డైలమాలో పడ్డారా అన్నది కూడా ప్రశ్నే .

రాజీనామా చేస్తే రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో అన్న సందిగ్ధంలో వంశీ
ఇక ఇదే సమయంలో వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకునేందుకుబీజేపీ ఏమైనా పావులు కదుపుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు. వైసీపీ లో చేరాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తీరాలి. రాజీనామా చేసి వెళ్తేనే పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని జగన్ పాలనా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలోనే చెప్పారు. మరి వంశీ అధికారికంగా రాజీనామా చేస్తే ఇక మరోమారు జగన్ అక్కడ నుండి పోటీకి అవకాశం ఇస్తారా ? ఇస్తే మళ్ళీ తాను గెలుస్తానా .. లేదా అన్నది వంశీకి టెన్షనే . అందుకే ఆయన ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

రాజీనామా చెయ్యకుండా బీజేపీలో చేరికపై పునరాలోచన చేస్తారా ?
వైసీపీలో చేరాలంటే ముందు ఎమ్మెల్యేగా అధికారికంగా రాజీనామా చేసి వెళ్ళాలి. అలా వెళ్ళాక తాను అనుకున్నట్టు తన రాజకీయ భవిష్యత్ లేకుంటే ఇబ్బంది పడాలి . ఈ డైలమానే వంశీని నాలుగు అడుగులు వెనక్కు లాగుతుందని తెలుస్తుంది. ఇక బీజేపీలో చేరితే రాజీనామా చెయ్యాల్సిన అవసరం ఉండదు కానీ వంశీ అనుచరులకు ,వంశీకి బీజేపీలో చేరాలని లేదు . ఒకవేళ వంశీ బీజేపీలో చేరాలి అనుకుంటే సుజనా చౌదరితో భేటీ అయినప్పుడే ఒక క్లారిటీ వచ్చేది. ఇప్పుడు తాజా పరిణామాలతో మరోమారు బీజేపీ విషయంలో వంశీ ఆలోచన చేస్తారా అన్నది కూడా ఆసక్తికర అంశమే .

ప్రస్తుతానికి పెండింగ్ లో వంశీ పార్టీ మార్పు .. ఈ ఉత్కంఠ కు ఎండింగ్ ఎప్పుడో
కానీ ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి అటు బీజేపీ వైపు చూడలేక ,ఇటు వైసీపీలోకి పోలేక వంశీ అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాడని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించి,చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పినా ఏ జెండా కప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఆయన చేరిక ఏ పార్టీలో ,ఎప్పుడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న వంశీ పార్టీ మార్పు అంశంతో నెలకొన్న ఉత్కంఠ కు ఎండింగ్ ఎప్పుడో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications