చాలా రోజులకు సీన్లోకి వంగవీటి రాధా... రాజధాని ఉద్యమ పోరుపై కీలక కామెంట్స్...
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత వంగవీటి రాధా అడపాదడపా మాత్రమే ప్రజల్లో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా అంతగా యాక్టివ్గా లేని రాధా... బుధవారం(అగస్టు 5) రాజధాని ప్రాంతంలో పర్యటించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాదాయత్రగా వెళ్లి తుళ్లూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

చివరి వరకు పోరాడాలని...
రాజధాని ఉద్యమ పోరులో అమరావతి రైతులకే అంతిమ విజయం దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు రాధా చెప్పారు. మూడు రాజధానుల గెజిట్పై హైకోర్టు స్టేటస్కో ఇవ్వడంతో రైతులకు తాత్కాలిక ఊరట లభించిందన్నారు. 232 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని అన్నారు. రైతులు తమ ఆత్మస్థైర్యం కోల్పోకుండా చివరి వరకు శాంతియుతంగా న్యాయపరంగా పోరాడాలని పేర్కొన్నారు.

ఆనాడే హామీ...
ఈ ఏడాది జనవరిలోనూ రాధా అమరావతికి వెళ్లి రైతు ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లాకే జగన్ వెన్నుపోటు పోడిచారని ఆ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనసున్న మహారాజని 151 సీట్లు ఇస్తే, ఆయనకు మాత్రం ప్రజల గోడు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రైతుల్ని కొందరు పెయిడ్ ఆర్టిస్ట్లు అంటున్నారని, వారిని అమరావతి పంపిస్తే..అసలు ఆర్టిస్ట్లు ఎవరో తెలిపోతుందన్నారు. . వైసీపీ వాళ్లు 3 రాజధానులు కాకపోతే, 30 రాజధానులు అనుకున్నా, తమకు మాత్రం అమరావతే రాజధాని అని తేల్చి చెప్పారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ఉంటానని ఆనాడే హామీ ఇచ్చారు.
Recommended Video

ముదురుతున్న వివాదం...
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులతోనే కోస్తాంధ్ర,రాయలసీమ,ఉత్తరాంధ్ర సమానంగా అభివృద్ది చెందుతాయని వైసీపీ చెబుతోంది. టీడీపీ మాత్రం ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధానం అని,దీని ద్వారా అభివృద్ది మరింత కుంటు పడుతుందని విమర్శిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు రాజీనామాలకు సవాళ్లు కూడా విసురుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజా మద్దతు ఉందో లేదో... అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని టీడీపీ సవాల్ విసిరింది. ఇటు వైసీపీ కూడా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో తమ వాదనకు మద్దతు ఉందో లేదో ఎన్నికల ద్వారా నిరూపించుకోవాలని సవాల్ విసిరింది. ఇలా సవాళ్లు,ప్రతి సవాళ్లు జరుగుతుండగానే... హైకోర్టు మూడు రాజధానుల గెజిట్పై స్టేటస్కో విధించడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 14న జరగనుంది.












Click it and Unblock the Notifications