విజయవాడ ఎంపీ బాధ్యతారాహిత్యం- లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విజయవాడలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగరంలో వందకు పైగా కేసులు నమోదైన కాఱణంగా భారీగా ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎంపీ కేశినేని ఇవాళ చిట్టినగర్ లో పేదలకు కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ చేపట్టారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్ధలు, రాజకీయ పార్టీలు అందిన కాడికి సాయం చేస్తున్నాయి. అయితే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనతో పాటు కనీస సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరగడం వల్ల కేసుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో కూరగాయల పంపిణీ కారణంగా లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదవుతున్నాయి. అయినా నేతల హంగామా మాత్రం ఆగడం లేదు.

విజయవాడ ఎంపీగా బాధ్యతాయుత స్ధానంలో ఉంటూ జనానికి సామాజిక దూరంపై సూచనలు చేయాల్సిన కేశినేని నాని ఇవాళ స్వయంగా టీడీపీ ఆధ్వర్యంలో చిట్టినగర్ లో నిర్వహించిన కూరగాయలు, నిత్యావసరాల పంపిణీలో పాల్గొన్నారు. అదీ కనీసం రెండు మీటర్ల దూరం కూడా లేకుండానే పేదలకు నిత్యావసరాల పంపిణీ చేశారు.

పేదలకు సాయం చేయాలన్న తపన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా సామాజిక దూరం పాటించకుండా ఇలాంటి సమూహ కార్యక్రమాలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ నేతలపై ఇదే కారణంతో విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు తాము కూడా అదే బాటలో పయనించడం సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications