ఆ ఇద్దరికీ పార్టీలో కీలక పదవులు: వైఎస్ జగన్ హామీ: అసంతృప్తులకు బుజ్జగింపులు
విశాఖపట్నం: రాష్ట్రంలో చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసంతృప్తి ఇంకా తగ్గట్లేదు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ ఎమ్మెల్యేలు తమ అసంతృప్త గళాన్ని వినిపిస్తూనే వస్తోన్నారు. పాయకరావుపేట శాసన సభ్యుడు గొర్ల బాబురావు ఉదంతం దీనికి నిదర్శనం. అటు కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖల పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బాధ్యతలను తీసుకోవడానికి కూడా నిరాకరిస్తోన్నారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం కొంత నిరాశతో ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండట్లేదనే వార్తలు వైఎస్ఆర్సీపీలో కలకలం రేపాయి. అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ కూడా ఇటీవలే బాహటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవిపై తాను ఆశలు పెంచుకున్నానని, అవి నెరవేరలేదంటూ వ్యాఖ్యానించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఆయన స్తబ్దుగా ఉంటున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీలను విమానాశ్రయానికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. వారికి పార్టీలో కీలక పదవులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తానని స్పష్టం చేశారు. నిరాశ చెందవద్దని, పార్టీకి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు.

మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ వారిద్దరి సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలకు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ సేవలను ఉపయోగించుకుంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారికి వివరించారు.
ఈ రెండున్నర సంవత్సరాలు అత్యంత కీలకమైనవని, ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని సూచించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి- విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications