పరిమళించిన మానవత్వం... పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన సిరిపురం ఆంధ్రా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్లో జరిగిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరారు. సీఎం కాన్వాయ్ సిరిపురం జంక్షన్ దాటుతుండగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు చంటిపిల్లలతో కలిసి కాన్వాయ్ ముందుకు వచ్చి.. జగనన్నా, జగనన్నా అంటూ బిగ్గరగా కేకలు వేశారు.
వెంటనే సీఎం జగన్ తన కాన్వాయ్ని ఆపి బయటకు దిగారు. వారిని దగ్గరకు రమ్మనమని పిలవడంతో వారంతా జగన్ దగ్గరకు వచ్చారు. తన పేరు ధర్మాల త్రివేణి అని.. తన భర్త అప్పలరెడ్డిని పెదవాల్తేరులో రూ.500 కోసం చంపేయడంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని చెప్పారు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, చిన్న ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలంటూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇవ్వడంతో వారు ఆనందభరితులయ్యారు. తమ సమస్యను సానుకూలంగా విన్నారంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
అదే సమయంలో.. శ్రీకాకుళం జిల్లా డీఆర్ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంగి రామారావు, సుబ్బలక్ష్మి దంపతులు కూడా తమ ఇద్దరు కుమారులు అనారోగ్యంతో బాధపడుతున్నారని సీఎంకు విన్నవించుకున్నారు. ఇద్దరు పిల్లలు సికిల్సెల్ థలసేమియాతో బాధపడుతున్నారని, చికిత్స చేయించాలని వేడుకున్నారు. వెంటనే వారికి చికత్స చేయించడానికి చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే శ్రీకాకుళం కలెక్టర్కు ఆదేశాలు జారీచేశారు.