ఏపీలో కరోనా: తప్పుచేశానన్న నర్సీపట్నం డాక్టర్.. ఎమ్మెల్యే గణేశ్పై అయ్యన్న ఫైర్..
కరోనా వైరస్ తో పోటీపడుతూ ఏపీలో రాజకీయ విన్యాసాలు కొనసాగుతున్నాయి. కొవిడ్-19పై పోరులో సీఎం జగన్ దారుణంగా ఫెయిలయ్యారని ఆరోపిస్తోన్న ప్రతిపక్ష టీడీపీకి.. నర్సీపట్నం డాక్టర్ సంచలన వీడియో కొత్త ఆయుధంగా దొరికింది. కాగా, అపిడమిక్ చట్టం అమలులో ఉండగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు ముఖ్యమంత్రుల్ని వాడు-వీడు అని తిట్టినందుకుగానూ సదరు నర్సీపట్నం డాక్టర్ సుధారక్ రావుపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కూడా టీడీపీ తప్పుపట్టింది. ఈలోపు డాక్టర్ కూడా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు..

అసలేం జరిగిందంటే..
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వాసుపత్రిలో ఎనస్తీషియనిస్టుగా పనిచేస్తోన్న డాక్టర్ సుధాకర్ రావు మూడ్రోజుల కిందట ఓ వీడియో చేశారు. ఏపీలో కొవిడ్-19 రోగులకు చికిత్స చేస్తోన్న డాక్టర్లకు కనీసం మాస్కులు కూడా లేవని, ఇలాగైతే రాష్ట్రంలో వైరస్ మరింతగా వ్యాపిస్తుందని, అదే తెలంగాణలో మాత్రం డాక్టర్లు వైద్య సిబ్బందిని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారని సుధాకర్ ఆరోపించారు. అయితే వీడియో చేయడానికి ముందు ఆయన.. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుణ్ని కలిశారని, ఇదంతా రాజకీయ డ్రామా అని వైసీపీ ఎదురుదాడి చేసింది. అసలాయన డాక్టరా? రాజకీయ నాయకుడా? అని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. మరుసటిరోజే నర్సీపట్నం డాక్టర్ ను సస్పెండ్ చేస్తూ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాదు, డాక్టర్ వ్యాఖ్యలపై విచారణకు కలెక్టర్ విడిగా మరో ఆదేశం జారీచేశారు.

తప్పు చేశాను కానీ..
ముఖ్యమంత్రుల్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తప్పు చేశానని, అయితే సమస్య తీవ్రంగా ఉండటం వల్లే ఆ స్థాయిలో ఆవేదన వ్యక్తమైందని డాక్టర్ సుధాకర్ చెప్పుకొచ్చారు. ‘‘సస్పెన్షన్ నా బ్యాడ్ లక్. సమాజానికి మంచి చేద్దామనే ఆ వీడియో చేశాను. నిజానికి నేనొక దళితుణ్ని. కాబట్టే గిరిజనుల్ని సోదరుల్లాగా భావిస్తాను. నర్సీపట్నం ప్రాంతంలోని గిరిజనులు ఎక్కువ. మాస్కులు అందించకపోతే పెను ప్రమాదం తలెత్తుతుందనే నేనా వీడియో చేశాను. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను టీడీపీ కార్యకర్తను కాను''అని తెలిపారు. అయితే..

అందుకే అయ్యన్న దగ్గరికి వెళ్లాను..
నర్సీపట్నం ఆస్పత్రిలో సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పట్టించుకోనందుకే వేరే దారి వెతుక్కున్నానని, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. నర్సీపట్నం ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ప్రెసిడెంట్ గా ఎనిమిదేళ్లు పనిచేశారు కాబట్టే ఆయన ఇంటికి వెళ్లానని, అయితే, ఆయన నిద్రపోయి ఉండటంతో కలవకుండానే వెనుదిరిగానని డాక్టర్ సుధాకర్ చెప్పారు. రాజకీయాలతో తనకు సంబంధంలేదని, ఇప్పటికైనా అందరికీ మాస్కులు అందించే ప్రయత్నం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయితే డాక్టర్ వాదనలో నిజంలేదని, మాస్కులు, పీపీఈలు సరిపడా ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

గణేశ్ వర్సెస్ అయ్యన్న
నర్సీపట్నం డాక్టర్ వీడియో వ్యవహారాన్ని వెనకుండి నడిపించింది మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడేనని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆరోపించారు. దీనిపై అయ్యన్న స్పందిస్తూ.. తాను గానీ డాక్టర్ తో మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాలు చేశారు. బాధ్యతగల ఎమ్మెల్యేగా ఉంటూ గణేశ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి ఏపీ సీఎం జగన్ సిగ్గు తెచ్చుకోవాలని, కరోనా బాధితుల్ని ఆదుకోవాలని అయ్యన్న విమర్శించారు.

ఇదీ ఏపీలో కొవిడ్ సీన్..
బుధవారం నాటికి ఏపీలో కొవిడ్-19 కేసుల సంఖ్య 329కి పెరిగింది. కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన కర్నూలులో అత్యధికంగా 74 కేసులు నమోదుకాగా, ఆ తర్వాతి స్థానాల్లో నెల్లూరు 49, గుంటూరులో 41 కేసులు ఉన్నాయి. రాత్రికి వెలువడే మరో బులిటెన్ లో కేసుల సంఖ్య పెరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications