‘భూదందా కోసమే విశాఖ: పెట్టుబడులకు వణుకు.., మెడలు వంచుతా అని..’
విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి... గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితమైందని అన్నారు. ప్రణాళిక లేని పాలన చేయడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోందని చెప్పారు. వైసీపీ తొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాభివృద్ధిని రివర్స్ గేర్లో తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేదన్నారు.

భూదందా కోసమే విశాఖ..
విశాఖపట్నంలోని జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి, అద్భుతమైన మెజార్టీ ఇస్తే ప్రజలకు మేలు చేయాలన్న తపన లేకుండా బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉగాది నాటికి ఇంటి పట్టాల పంపిణీ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, చివరకు ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూములును సైతం లాక్కొంటోంది. భూదందాల కోసమే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేశారు తప్ప.. దీనిపై ప్రత్యేక ప్రేమగానీ, అభివృద్ధి ప్రణాళికగానీ లేదు. ప్రశాంతంగా నివసించే ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తమ భూదందాలకు అడ్డాగా విశాఖపట్నాన్ని మార్చుకోవడం కోసమే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. విశాఖపట్నం మంచి ఐ.టి., టూరిజం హబ్ గా మారాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటుంటే... నాయకులు చేసే ప్రకటనలు మాత్రం అయోమయం సృష్టించే విధంగా ఉన్నాయి. వెనకబడిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి.... కానీ ఇక్కడ దానికి రివర్స్ లో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

పెట్టుబడులు పెట్టాలంటే వణుకుతున్నారు
మాది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొటున్న వైసీపీ ప్రభుత్వం... గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన పనుల్లో కేవలం 42 శాతమే పూర్తి చేసింది. రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. పెట్టుబడులు పెట్టాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కంపెనీలను సైతం వెళ్లగొడుతున్నారు. రాజధాని చేస్తామన్న ప్రాంతంతో భావోద్వేగ అనుబంధం ఉండాలి తప్ప.. మూడు బిల్డింగులు కట్టి, ఉద్యోగులను తరలిస్తే రాజధాని అయిపోదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఏజెన్సీలో వైద్యం అందని ద్రాక్షలా మరింది. కనీసం 10 మంది డాక్టర్లు ఉండాల్సిన ఆస్పత్రుల్లో ముగ్గురు కూడా లేరు. విభజన హామీ చట్టంలో భాగంగా ఈ ప్రాంతానికి రావాల్సిన సంస్థలను కూడా తీసుకురాలేకపోయారు. భూమి కేటాయించాలి, మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు. భూదందాలు, ఫ్యాక్షన్ రాజకీయాల కోసం సమయం కేటాయిస్తున్నారు తప్ప... అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం లేదు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రూ.3200 కోట్లు రుణం ఇస్తామంటేనే వద్దన్న ప్రభుత్వం ఇది' అని నాదెండ్ల విమర్శించారు.

రాష్ట్రం మేలు కోసమే బీజేపీతో పొత్తు
రాష్ట్రానికి మేలు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. దక్షిణ భారతదేశం నుంచి ఎవరూ ముందుకు రాని సమయంలోనే 2014 సంవత్సరంలోనే దేశానికి నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకులు అవసరం ఉందని భావించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం తప్పకుండా అవసరమని మేము నమ్ముతున్నాం. రాబోయే అన్ని ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. భవిష్యత్తులో తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో అద్భుతమైన మెజార్టీ ఉంది. ఆ పార్టీకి వైసీపీ అవసరం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీసులు తమకున్నాయని లేనిపోని విషయాలను వైసీపీ నాయకులు ప్రచారం చేసుకొంటున్నారు. ఏ కారణాలతో బీజేపీతో కలిసి పనిచేయాలనుకున్నామనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్తాం. ఉగాది నుంచి ఇరు పార్టీలు కలిసి సమష్టిగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాయన్నారు నాదెండ్ల మనోహర్.
Recommended Video


మెడలు వంచుతామన్నారు..
వైసీపీ అధికారంలోకి వచ్చి, వీలైనన్ని ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదు. కనీసం పార్లమెంటులో ఎందుకు దీని గురించి చర్చించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడున్న రిజర్వేషన్ల మేరకే నిర్వహిస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. ఈ విషయంలో మీ ఆర్డినెన్సులు, జి.ఒ. లు లీగల్ గా నిలబడవని మీకు తెలుసు. అయినా మీరు ప్రజల్ని మభ్యపెట్టారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి తన వైఖరి స్పష్టం చేయాలి. మీరు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారనేది ప్రజల అనుమానం. మా పార్టీ కూడా అలాగే భావిస్తోంది. ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాల్సిందే. 59 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు కుదించి ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు చెప్పడం వంచనే. కన్వీనియంట్ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని నాదెండ్ల అన్నారు. ఈ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పి.ఏ.సి. సభ్యులు కోన తాతారావు, ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ కన్వీనర్ సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు.
జనసైనికుని కుటుంబానికి పరామర్శ:
విశాఖపట్నం నగరానికి చెందిన జన సైనికుడు దువ్వి వెంకట నాగేంద్ర అశోక్ ఇటీవల హఠాత్తుగా కన్నుమూశారు. ఉన్నత విద్యావంతుడైన ఈ యువకుడు తొలి నుంచి జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అశోక్ మరణం గురించి తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఉదయం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అశోక్ చిత్రపటానికి నివాళులర్పించారు. అశోక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications