విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఘోరం: ఒడిశా యువతి మృతదేహం లభ్యం
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం ఉత్సాహం- ఒకరి కుటుంబంలో చీకట్లను నింపింది. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. తీరని శోకంలోకి నెట్టేసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో విశాఖపట్నాన్ని తిలకించడానికి వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ఓ యువతి మృతదేహం లభించింది. మిగిలిన వారిని పోలీసులు, సముద్ర తీర ప్రాంత గస్తీ బలగాలు కాపాడాయి.
మృతిచెందిన యువతిని సునీత త్రిపాఠిగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యాహ్నం విశాఖపట్నం రామకృష్ణా బీచ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా సెలవులు రావడం, ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ సందర్శకులతో నిండిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులకు విశాఖకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పర్యాటకుల రాకతో ఆర్కే బీచ్ సందడిగా మారింది. కోలాహలంతో నిండిపోయింది.
ఒడిశా నుంచి పర్యాటకులు పర్యాటక బస్సులు, కార్లు.. ఇతర ప్రైవేటు వాహనాల్లో ఆర్కే బీచ్కు బారులు తీరారు. గంజాం జిల్లాకు చెందిన నలుగురు కారులో విశాఖపట్నానికి వచ్చారు. వారిలో ఒక యువతి ఉన్నారు. రుషికొండ సహా వేర్వేరు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆర్కే బీచ్కు చేరుకున్నారు. సముద్రంలో సరదాగా స్నానం చేస్తోన్న సమయంలో అలల తాకిడికి నలుగురూ కొట్టుకుపోయారు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు, సముద్ర తీర ప్రాంత గస్తీ బలగాలకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో దిగారు. లైఫ్ జాకెట్లు, స్పీడ్ బోట్లతో వారిని కాపాడారు. దురదృష్టవశావత్తూ సునీత త్రిపాఠి అనే యువతిని కాపాడలేకపోయారు. అలల ఉధృతికి ఆమె కొట్టుకెళ్లారు. పెద్ద ఎత్తున గాలించిన తరువాత సునీత త్రిపాఠి మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మిగిలిన ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు.